ఇదేమి చలిరా బాబోయ్‌.. నెలాఖరు దాకా ఇంతేనట

Updated on: Dec 23, 2025 | 4:47 PM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చలి తీవ్రత పెరిగి, ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, దట్టమైన పొగమంచు జనజీవనాన్ని స్తంభింపజేస్తోంది. ఉత్తరాదిలోనూ హిమపాతం, తీవ్ర చలిగాలులు వీస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు చలి పెరుగుతుంది. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పదేళ్ల కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఆదిలాబాద్ 6.7, మెదక్ 7.4, హనుమకొండ 10 డిగ్రీలు.. హైదరాబాద్‌లో 11.2, హయత్‌నగర్‌ 11.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రామగుండంలో 11.3 డిగ్రీలు.. నిజామాబాద్ 12, ఖమ్మం 12.2, నల్గొండ 13, మహబూబ్‌నగర్‌లో 14.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. తీవ్రమైన చలితో.. రోజువారి పనుల కోసం ఉదయం బయటికి వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగ మంచు కారణంగా వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు.చలి తీవ్రత పెరగడంతో చిన్న పిల్లలు, వృద్దులు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్లు. పలు జిల్లాల్లో చలితో పాటు పొగమంచు కమ్ముకుంటుండటంతో ఉదయం 9 గంటలైనా ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. చలితో పాటు పొగమంచు కూడా తీవ్రంగా ఉంటుందని IMD అంచనా వేసింది. తెలంగాణతో పాటు కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలలోనూ తీవ్రమైన చలిగాలులు వీస్తాయని IMD ప్రకటించింది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు పలు చోట్ల సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. అటు ఏపీలోని అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత కొనసాగుతుంది. పొగమంచు దట్టంగా అలుముకుంది. పలు చోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్స్‌కు పడిపోయాయి. మినుములూరు, అరకులో 5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత… పాడేరులో 7 డిగ్రీల ఉష్ణగ్రత నమోదైంది. దట్టమైన పొగ మంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లైట్లు వేసుకుని వెళ్తున్నారు. ఉత్తర భారతం చలి, పొగమంచు, హిమపాతం గుప్పిట్లో ఉంది. 7 రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు, 3 రాష్ట్రాల్లో హిమపాతం కురుస్తోంది. 10 రాష్ట్రాల్లో విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఉత్తరాది రాష్ట్రాల్లో మరో 4 రోజులు చలి, పొగమంచు కొనసాగే పరిస్థితులు ఉన్నట్లు IMD హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్‌కు రెడ్‌ అలర్ట్‌ జారీ అయింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్‌, ఉత్తరాఖండ్‌కు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేశారు. జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ వంటి ప్రాంతాల్లో హిమపాతం కురుస్తోంది. ఈ సీజన్‌లో ఇదే తొలి హిమపాతం. తెల్లని మంచు అందాలు పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నాయి. ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కాలుష్యాన్ని తట్టుకోలేక, చాలామంది ఇలాంటిచోట్లకు క్యూ కడుతున్నారు. యూరప్‌ను తలపించే అందాలు వారిని ఆకర్షిస్తున్నాయి. శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సులో ఎక్కడచూసినా పొగమంచు దట్టంగా కనిపిస్తోంది. ఈ వాతావరణంలోనే టూరిస్టులు ఎంజాయ్‌ చేస్తున్నారు. దాల్‌ సదస్సులో పడవలపై విహరించడానికి ఇష్టపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాక్ బౌలర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైభవ్

Cold Waves in AP: అరకులో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

మొన్న మహానటి.. నిన్న సీతారామం.. నేడు ఛాంపియన్.. సత్తాచాటుతున్న అశ్వినీదత్ డాటర్

సంక్రాంతి బరిలో ట్విస్ట్ ఇచ్చిన రవితేజ.. మిగతా హీరోలకు ప్రెజర్ తప్పదా

మారుతున్న ప్రమోషన్‌ ట్రెండ్‌… మాయ చేస్తున్న ఏఐ

Published on: Dec 23, 2025 04:41 PM