Rain Alert: దూసుకొస్తున్న వాయుగుండం.. స్కూళ్లకు సెలవులు.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

|

Oct 16, 2024 | 7:15 AM

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా బలపడి.. అలజడి రేపుతోంది.. ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరం వైపు కదలుతూ తీవ్ర తుఫానుగా మారిందని.. దీని ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఏపీకి మళ్లీ వర్షాల ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చి మ వాయువ్య దిశగా పయనిస్తూ తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా బలపడింది. ఇప్పటికే రెండు రోజుల నుంచి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ముప్పుతో ఫ్లాష్ ఫ్లడ్స్‌ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.. నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్‌ వచ్చే చాన్స్‌ ఉందని అంచనావేసింది.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.. ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.. ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ నేపథ్యంలో నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో.. ఆయా జిల్లాల కలెక్టర్లు బుధవారం స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరం వైపు కదలుతూ తీవ్ర తుఫానుగా మారిందని.. తీర ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయిన వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుంది. రేపు పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వాయుగుండం ప్రభావంతో సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి.. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంత్రులు నారాయణ, నిమ్మల, ఆనం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..