PM Modi: లీకు వీరులకు మోదీ సర్కార్ మాస్టర్ స్ట్రోక్

Updated on: Jul 27, 2026 | 8:48 PM

దేశంలో పరీక్షల పేపర్ లీకేజీలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నందన్ నిలేకణి నేతృత్వంలో ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు-2026'ను తీసుకొచ్చింది. ఏఐ, బయోమెట్రిక్స్, డిజిటల్ భద్రతతో పరీక్షల నిర్వహణను పారదర్శకంగా మార్చడమే లక్ష్యం. పేపర్ లీక్ నిందితులకు కఠిన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా బిల్లులో ప్రతిపాదించారు.

ఒకే ఒక్క స్ట్రోక్.. దెబ్బకు లీకులన్నింటికీ చెక్. అదీ మోదీ స్టైల్. ఇప్పుడు ఇండియాలో దీనిపైనే చర్చ. అవును. దేశంలో పోటీ పరీక్షలు, ఇతర పరీక్షల్లో పేపర్ లీకేజీలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ‘ఉన్నత స్థాయి పరీక్షల సంస్కరణల టాస్క్ ఫోర్స్’ను ఏర్పాటుచేసినట్లు ఆదివారం ప్రకటించారు. ఈ ఉన్నత స్థాయి కమిటీకి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక నిపుణుడు నందన్ నిలేకని ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు, 2026’.. దీని గురించి ప్రధాని చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు భరోసాగా నిలుస్తోంది. ఈ బిల్లు ఉద్దేశం చూస్తే.. విద్యార్థుల భవిష్యత్తును కాపాడటం.. అలాగే పారదర్శకమైన, విశ్వసనీయమైన పరీక్షా విధానాన్ని అందించడమే లక్ష్యంగా ఉంది. ఇదే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ప్రధాని కూడా చెప్పారు. దీనికి సంబంధించి ఆదివారం ఎక్స్‌లో ఒక వీడియోనూ విడుదల చేశారు. అందులో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు వెనక గల 3 ప్రధాన కారణాలు ఏమిటో కూడా చెప్పారు. అవన్నీ నేను మీకు చెబుతాను. అందులో మొదటిది.. కీలక పరీక్షల నిర్వహణ వ్యవస్థపై ప్రజల్లో, అభ్యర్థుల్లో కోల్పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించడం. ఇక రెండోది.. సాంకేతిక ఆధారిత భద్రతా చర్యల ద్వారా పేపర్ లీకేజీలను అరికట్టడం. మూడోది.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ , ఇతర పరీక్షా సంస్థలలో నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకురావడం. ఇవీ మూడు ముఖ్య కారణాలు. ప్రధాని ప్రకటించిన టాస్క్‌ఫోర్స్‌ ముందు 4 ప్రధాన లక్ష్యాలను కేంద్రం ఉంచింది. వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. బహిరంగ పరీక్షలలో పారదర్శకతను పెంచడం. పరీక్షల ఇన్విజిలేషన్, కంట్రోల్, పర్యవేక్షణలో AI, డిజిటల్ సెక్యూరిటీ టెక్నాలజీని వాడటం. ప్రశ్నాపత్రాల తయారీ నుండి పంపిణీ వరకు ప్రతి దశలోనూ లీకేజీలకు తావులేకుండా చేయడం. పోటీ పరీక్షల వ్యవస్థ సామర్థ్యాన్ని, క్రెడిబిలిటీని పెంచడం. ఈ కమిటీలో సాంకేతికత, భద్రత, లాజిస్టిక్స్, పరిపాలన రంగాలకు చెందిన దిగ్గజ నిపుణులను సభ్యులుగా నియమించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా, 100% యాక్యురసీతో ఉండే డిజిటల్ భద్రతా వ్యవస్థను రూపొందించడమే ఈ కమిటీ పని. త్వరలోనే ఈ టాస్క్‌ఫోర్స్ తన సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పిస్తుంది. ఇక ఈ కమిటీలో సభ్యులుగా ఎవరెవరున్నారో చూద్దాం. ఫస్ట్ నందన్ నిలేకని గురించి చెప్పుకోవాలి. 1981లో నారాయణ మూర్తి, ఇంకా మరో ఆరుగురు సహ వ్యవస్థాపకులతో కలిసి ఇన్ఫోసిస్ సంస్థను ప్రారంభించారు. 2007 వరకు ఇన్ఫోసిస్ సీఈవోగా పనిచేశారు. 2009లో నాటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ”యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా”కి తొలి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. దేశంలోని ప్రతీ పౌరుడికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య అందించే ఆధార్ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. పరీక్షల డేటా హ్యాకింగ్‌కు గురికాకుండా ఉండేలా ‘ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్’ ప్లాట్‌ఫామ్‌ను రూపొందిస్తారు. అలాగే, పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్, ఏఐ ఆధారిత తనిఖీల ద్వారా ఇతరుల పేర్లతో పరీక్ష రాసే అక్రమాలకు స్వస్తి చెబుతారు. ఈ కమిటీలో మరో ముఖ్యమైన వ్యక్తి.. V.కామకోటి. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ గా ఉన్న కామకోటి.. కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో సైబర్ దాడులు జరగకుండా సాఫ్ట్‌వేర్, సర్వర్ భద్రతను పటిష్టం చేయడంలో ఈయన రోల్ చాలా కీలకం. ప్రతీ కంప్యూటర్‌లో ప్రశ్నల వరుసక్రమం పరీక్ష సమయానికి ఆటో మేటిగ్గా మారే ఏఐ టెక్నాలజీని తయారుచేసే పనిలో ఉన్నారు. దీనివల్ల లోకల్ సర్వర్ల హ్యాకింగ్, స్క్రీన్ షేరింగ్ వంటి సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడుతుంది. ఇక మూడో ముఖ్యమైన వ్యక్తి.. S.సోమ్‌నాథ్. ఇస్రో మాజీ ఛైర్మన్ అయిన సోమనాథ్… అంతరిక్ష ప్రయోగాల్లో వాడే ‘జీరో-ఎర్రర్’ విధానాన్ని పరీక్షల వ్యవస్థలో అమలు చేసేందుకు ప్లాన్స్ తయారుచేస్తారు. ప్రశ్నాపత్రాల తయారీ నుంచి ఫలితాల విడుదల వరకు ప్రతీ దశలోనూ బహుళ అంచెల తనిఖీ వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల మానవ పొరపాట్లు లేదా సాంకేతిక లోపాలు తలెత్తకుండా చూడడానికి వీలవుతుంది. ఇక మరో ఇంపార్టెంట్ పర్సన్ తపన్ దేకా. ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ అయిన ఈ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్.. పరీక్షల మాఫియా, పేపర్ లీక్ ముఠాల గుట్టురట్టు చేసేందుకు హెల్ప్ చేస్తారు. అవసరమైన రియల్ టైమ్ సైబర్ నిఘా వ్యవస్థను, ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను రూపొందించడంలో సాయపడతారు. లీకేజీలు జరిగే ముందే అనుమానాస్పద కార్యకలాపాలను పసిగడతారు. పరీక్షా కేంద్రాల భద్రతపై కఠినమైన ఆడిటింగ్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇంకో ముఖ్యమైన నిపుణులు అమృత్ లాల్ మీనా. లాజిస్టిక్స్ రంగంలో తిరుగులేని హిస్టరీ ఉంది. ప్రశ్నాపత్రాల ప్రింటింగ్, రవాణా, స్టోరేజ్.. ఈ ప్రక్రియలను డిజిటల్ లాకింగ్, జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షించేలా భద్రతా విధానాలను రెడీ చేస్తారు. సరిగ్గా పరీక్ష సమయానికి.. అంటే అనుకున్న టైమ్ లో మాత్రమే తెరుచుకునే డిజిటల్ లాకర్లను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా పేపర్ ముందే బయటకి వచ్చే అవకాశమే ఉండదు. అలా చేయడానికి కసరత్తు చేస్తారు. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారిణి.. అనితా కర్వాల్ గురించి చెప్పుకోవాలి. కేంద్ర విద్యారంగ కార్యదర్శిగా పని చేసిన అనుభవం ఉంది. గతంలో CBSEకి మాజీ ఛైర్‌పర్సన్‌గానూ సేవలందించారు. తన అనుభవంతో, అకడమిక్ సంస్కరణలు, విద్యార్థుల విధానాలపై అనిత సలహాలు అందిస్తారు. గ్రేస్ మార్కుల విధానం, ఆన్సర్ కీ వివాదాల పరిష్కారం, పరీక్షా కేంద్రాల ప్రామాణిక నిబంధనల అమలు.. వీటి ద్వారా మూల్యాంకన ప్రక్రియను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుతారు. ఈ కమిటీ ప్రకటన తర్వాత.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంటోందని ప్రధాని మోదీ తన వీడియోలో తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిన నిందితులు ప్రస్తుతం జైలులో ఉన్నారని చెప్పారు. పరీక్షల్లో అక్రమాలకు సంబందించిన కేసుల విచారణ కోసం.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశారు. కఠిన శిక్షలకు వీలు కల్పించే కొత్త చట్టాన్ని తయారుచేసే పనిలో ఉన్నారు. ఇక.. పరీక్షల నిర్వహణ వ్యవస్థను మరింత విశ్వసనీయంగా, పారదర్శకంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీని విస్తృతంగా వినియోగించాలి. పరీక్షల నిర్వహణలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలి. నందన్ నిలేకణి నేతృత్వంలోని ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్ దీనికి సంబంధించిన సిఫార్సులు అందజేస్తుందని మోదీ తన వీడియోలో చెప్పుకొచ్చారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు, 2026ను కేంద్రం.. పార్లమెంటు ముందుకు తెచ్చింది. ఈ కొత్త సవరణ బిల్లులో అత్యంత కఠినమైన నిబంధనలు ఉన్నాయి. పేపర్ లీకేజీ కేసులను మాత్రమే విచారించేందుకు ప్రతీ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని బిల్లులో ప్రతిపాదించారు. దీంతోపాటు ఈ కేసులకు సంబంధించిన విచారణను కేవలం రెండు నెలల గడువులోనే పూర్తి చేయాలని ఇందులో పొందుపరిచారు. పేపర్ లీక్‌లకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపేలా శిక్షల తీవ్రతను భారీగా పెంచారు. వ్యక్తిగతంగా పేపర్ లీకేజీకి పాల్పడినట్లు రుజువైతే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఇక ముఠాగా ఏర్పడి నెట్‌వర్క్ నడిపే ఆర్గనైజ్డ్ లీకేజీ సిండికేట్లకు ఏకంగా రూ.10 కోట్ల వరకు భారీ పెనాల్టీ విధించేలా కఠిన నిబంధనలు చేర్చారు. సో.. లీకు వీరులకు మోదీ సర్కార్ మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతుంది. ఈ విషయం ఖాయంగా కనిపిస్తోంది. పరీక్షల పేపర్లను లీక్ చేయాలంటేనే.. లీకువీరుల వెన్నులో వణుకు పుట్టేలా… ఉన్నత స్థాయి పరీక్షల సంస్కరణల టాస్క్ ఫోర్స్ వర్క్ చేయాలి. అప్పుడే విద్యార్థుల కష్టానికి ఫలితం దక్కుతుంది. ఏడాదంతా చదివి పరీక్షలు రాసే స్టూడెంట్స్ కు న్యాయం జరుగుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కెమెరామెన్‌కి బంపరాఫర్‌.. యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!

బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!

Weather Update: దూసుకొస్తున్న వాయు‘గండం’.. దంచికొట్టనున్న వర్షాలు.. వచ్చే మూడు రోజులు ముసురే

Cyber Crime:పార్శిల్‌ వచ్చింది.. రూ.22 పే చేయమని మెసేస్‌ వచ్చిందా.. అయితే.. బీ అలర్ట్!

Follow Us