చిన్న రక్త పరీక్షతో క్యాన్సర్ ముప్పు గుర్తింపు

Updated on: Nov 14, 2025 | 11:43 AM

కొత్త 'లిక్విడ్ బయాప్సీ' రక్తపరీక్షతో లక్షణాలు బయటపడకముందే అనేక రకాల క్యాన్సర్లను తొలిదశలోనే గుర్తించవచ్చు. ఇది వ్యాధి ముదిరి నాలుగో దశకు చేరే కేసులను గణనీయంగా తగ్గిస్తుంది. MCED పరీక్షలు క్యాన్సర్ నియంత్రణలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయి, ప్రాణాలను కాపాడతాయి మరియు చికిత్స భారాన్ని తగ్గిస్తాయి.

క్యాన్సర్‌.. రకరకాల రూపాల్లో ప్రపంచాన్ని భయపెడుతోంది. ప్రజలు వివిధ రకాల క్యాన్సర్లకు గురవుతున్నారు. కొన్ని రకాల క్యాన్సర్లు లక్షణాలు కనపడకుండానే ప్రమాదకరస్థాయికి చేరి ఊహించని విధంగా మనుషులను బలితీసుకుంటుంది. ఈ తరుణంలో వైద్యరంగంలో క్యాన్సర్‌కు సంబంధించి ఓ కీలక ముందడుగు పడింది. లక్షణాలు బయటపడక ముందే, కేవలం ఒక సాధారణ రక్త పరీక్ష ద్వారా అనేక రకాల క్యాన్సర్లను గుర్తించే సరికొత్త విధానం అందుబాటులోకి రాబోతోంది. ఈ ‘లిక్విడ్ బయాప్సీ’ పరీక్ష ద్వారా, వ్యాధి ముదిరిపోయి నాలుగో దశకు చేరే కేసులను గణనీయంగా తగ్గించవచ్చని ఓ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఒక్క 2020లోనే క్యాన్సర్ వల్ల కోటి మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రొమ్ము, గర్భాశయ, పెద్దప్రేగు వంటి కొన్ని క్యాన్సర్లకు మాత్రమే ప్రామాణిక స్క్రీనింగ్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. దీంతో 70 శాతానికి పైగా కొత్త క్యాన్సర్ కేసులు, లక్షణాలు ముదిరిన తర్వాతే బయటపడుతున్నాయి. దీనివల్ల చికిత్స కష్టమవడమే కాకుండా, ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతోంది. అయితే, ఒకే రక్త నమూనాతో పదుల సంఖ్యలో క్యాన్సర్లను గుర్తించే ‘మల్టీ-క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్’ (MCED) టెస్టులు ఈ పరిస్థితిని మార్చగలవని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీకి చెందిన ‘క్యాన్సర్’ అనే ప్రముఖ జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. ‘క్యాన్సర్‌గార్డ్’ అనే టెస్టును ఉపయోగించి ఈ పరిశోధన చేశారు. అమెరికాలోని 50 నుంచి 84 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన 50 లక్షల మందికి చెందిన 10 సంవత్సరాల డేటాను తీసుకుని, వారికి ఏటా ఈ రక్త పరీక్ష చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో సిమ్యులేషన్ ద్వారా అంచనా వేశారు. ఈ సిమ్యులేషన్ ఫలితాలు అద్భుతమైన మార్పును సూచించాయి. ఈ పరీక్ష వల్ల క్యాన్సర్‌ను మొదటి దశలో గుర్తించే కేసులు 10%, రెండో దశలో 20%, మూడో దశలో 30% పెరిగాయి. అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, వ్యాధి ముదిరిపోయి చివరిదైన నాలుగో దశలో బయటపడే కేసులు ఏకంగా 45% తగ్గాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, పెద్దప్రేగు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లలో నాలుగో దశ కేసులు గణనీయంగా తగ్గుతాయని తేలింది. ఈ అధ్యయనానికి సంబంధించి హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన డాక్టర్ జగ్‌ప్రీత్ చట్వాల్ వివరిస్తూ.. “ఈ మల్టీ-క్యాన్సర్ రక్త పరీక్షలు క్యాన్సర్ నియంత్రణలో ఒక గేమ్-ఛేంజర్‌గా నిలుస్తాయి. వ్యాధి శరీరమంతా వ్యాపించక ముందే గుర్తించడం వల్ల ప్రాణాలను కాపాడటంతో పాటు, రోగులపై వ్యక్తిగత, ఆర్థిక భారం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అది రైలు బ్రో.. మన ఇల్లు కాదు.. అలా ఎలా చేస్తావ్ ??

ఈమె టెక్నిక్ చూస్తే.. ప్రతి ఇంట్లో ఆడోళ్లు ఇలానే చేస్తారేమో.. ఐడియాకి సెల్యూట్‌ చెయ్యాల్సిందే

సూట్‌కేసులో నుంచి వింత శబ్దాలు.. ఓపెన్‌ చేసి చూడగా షాక్‌

వామ్మో.. ఒక్కపీత ఖరీదు నాలుగు వేలా ??

ఇది తల్లి ప్రేమ మాత్రమే కాదు.. అంతకు మించి!