లింగం కాదు.. నిలువెత్తు రూపంలోనే పరమశివుడు!

Updated on: Feb 15, 2026 | 11:56 AM

భారతదేశంలో ఎక్కడ చూసినా పరమశివుడు లింగాకారంలోనే దర్శనమిస్తాడు. కానీ, శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి గ్రామంలో మాత్రం ఒక అద్భుతం కనిపిస్తుంది. ఇక్కడి ఆలయంలో ఈశ్వరుడు లింగ రూపంలో కాకుండా, నిలువెత్తు మానవాకార విగ్రహ రూపంలో భక్తులకు దర్శనమివ్వడం విశేషం. నొలంబరాజుల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి 'దక్షిణ కాశీ'గా పేరుంది. ఏడవ శతాబ్దంలో నొలంబరాజుకు సంతానం లేకపోవడంతో పరమశివుడిని ప్రార్థించగా.. తనకు లింగ రూపంలో కాకుండా, మానవాకారంలో విగ్రహాన్ని ప్రతిష్టించాలని శివుడు కలలో ఆజ్ఞాపించాడట.

రాజు అలా విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత ఆయనకు సంతాన ప్రాప్తి కలిగిందని చరిత్ర చెబుతోంది. అప్పటి నుండి ఇక్కడ శివుడి విగ్రహానికే నిత్య పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా లింగాభిషేకాలు జరుగుతుంటే, హేమావతిలో మాత్రం విగ్రహ రూపంలో ఉన్న స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శివరాత్రి సందర్భంగా ఇక్కడ వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా, సరిహద్దు కర్ణాటక నుండి కూడా వేలాది మంది భక్తులు తరలివస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే ‘అగ్నిగుండం’ ప్రవేశాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున వేచి చూస్తారు. సంతాన ప్రాప్తి కోసం ఈ స్వామిని దర్శించుకుంటే కోరికలు నెరవేరతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శిల్పకళా సంపదతో, ఆధ్యాత్మిక వైభవంతో విరాజిల్లుతున్న హేమావతి క్షేత్రం శివరాత్రి వేళ భక్తజన సంద్రంగా మారుతుంది.

మరిన్ని వీడియోల కోసం :

వ్యూహం ఫలించింది..విజయం వరించింది వీడియో

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్

ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు

భారీ ఆఫర్ వదిలేసిన రౌడీ బాయ్.. కారణం ఇదే..!