Sangareddy: ఆ గుడి వెళ్తే అదో మాదిరి వాసన.. సమాచారంతో పోలీసులు తనిఖీలు చేయగా..
ఆధ్యాత్మిక క్షేత్రం సమీపంలో అక్రమ గంజాయి సాగు వెలుగులోకి రావడంతో భక్తులు అవాక్కయ్యారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగామ గ్రామ శివారులోని విఠలేశ్వర స్వామి ఆలయం వెనుక భాగంలో భారీగా సాగు చేసిన సుమారు 600 గంజాయి మొక్కలు, 15 కిలోల ఎండు గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.
భక్తి వెల్లి విరియాల్సిన ఆధ్యాత్మిక క్షేత్రం సమీపంలో అక్రమ గంజాయి సాగు వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ఆలయానికి నిత్యం వచ్చే భక్తులు అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే నారాయణఖేడ్ మండలం పంచగామ గ్రామ శివారులోని ప్రసిద్ధ విఠలేశ్వర స్వామి ఆలయం వెనుక భాగంలో భారీ ఎత్తున గంజాయి సాగు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 600 గంజాయి మొక్కలను.. 15 కిలోల ఎండు గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కలను అధికారులు అక్కడికక్కడే ధ్వంసం చేశారు. పరారీలో ఉన్న అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆలయ భూములకు సమీపంలో ఈ అక్రమ సాగుకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇక సాగు చేస్తున్న దేవస్థానం అధిపతి నాగన్నా మహరాజ్ను అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు.. రాష్ట్రవ్యాప్తంగా మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, ఇలాంటి ఘటనలు అధికారులకు సవాలుగా మారుతున్నాయి.