Tirumala: నటుడు రాజేంద్రప్రసాద్ గెస్ట్‌హౌస్‌లో అనుకోని అతిథి.. అందరూ షాక్

Edited By:

Updated on: May 23, 2025 | 9:48 PM

తిరుమలకు వీఐపీలు రావడం సర్వసాధారణం. కానీ ఇప్పుడు అనుకోని అతిథుల ఎంట్రీలు సైతం ఎక్కువయ్యాయి. నిత్యం భక్తులతో కిటకిటలాడే తిరుమలలో అతిథుల్లా దర్శనమిస్తున్న పాములు ఇప్పుడు భయపెడుతున్నాయి. తరచూ కనిపిస్తున్న పాములతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు తిరుమలలో సర్వసాధారంగా మారిపోతున్నాయి.

శేషాచలం అటవీ ప్రాంతంలోని విష సర్పాలు తరచూ బయట కనిపిస్తుండడంతో భక్తుల్లో వణుకు పుడుతోంది.  నడక మార్గాల్లోనే కాకుండా భక్తులు సేద తీరే చోట్ల, వీఐపీలు బస చేసే కాటేజీలు, స్థానికులు నివాసం ఉండే ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. తాజాగా శుక్రవారం రోజున పద్మావతి ఎంక్వయిరీ కార్యాలయం సమీపంలోని సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌కు చెందిన గెస్ట్ హౌస్‌లో పాము కనిపించింది. 5 వ నంబర్ రూమ్‌లో నాగుపామును గుర్తించారు. గెస్ట్ హౌస్‌ను శుభ్రం చేస్తున్న సిబ్బందికి అనుకోని అతిథిలా నాగు పాము ప్రత్యక్షం అయింది. దాదాపు 5 అడుగుల మేర ఉన్న నాగుపాము కనిపించడంతో స్టాఫ్ భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు.  బయటకు వచ్చి అక్కడున్న అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పాములను రెస్క్యూ చేసే టిటిడి ఫారెస్ట్ ఉద్యోగి భాస్కర్ నాయుడుకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడ వాలిపోయిన భాస్కర్ నాయుడు నాగుపామును చాకచక్యంగా పట్టుకుని బయటకు తెచ్చాడు. అటవీ ప్రాంతంలో వదిలి పెట్టడంతో హమ్మయ్య అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

 

Published on: May 23, 2025 04:28 PM