
బ్రిక్స్ సదస్సులో పాల్గొని స్వదేశానికి తిరిగ వెళ్లిన సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనకు వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని, బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. అయితే, అదే సమయంలో సోషల్ మీడియాలో కొన్ని తప్పుడు వదంతులు వైరల్ అయ్యాయి. బ్రిక్స్ సదస్సు కోసం భారత్కు వచ్చిన చైనా అధ్యక్షుడు న్యూఢిల్లీలోనే స్ట్రోక్కు గురయ్యారని, వెంటనే ఆయన ప్రత్యేక విమానంలో చైనాకు వెళ్లి చికిత్స పొందుతున్నారంటూ ప్రచారం జరిగింది. ఇలా సదస్సుకు హాజరైన ప్రపంచ నేతలంతా వరుసగా అనారోగ్యాలపాలవుతున్నారంటూ నెట్టింట కొందరు కావాలనే ఫేక్ న్యూస్ సృష్టించి ప్రచారం చేశారు.
JUST IN: 🇿🇦🇮🇳 South African President Ramaphosa becomes ill after attending BRICS summit in India. https://t.co/OCirinOUf4
— BRICS News (@BRICSinfo) September 17, 2026
బ్రిక్స్ సదస్సు తర్వాత ప్రపంచ నేతల్లో అనారోగ్యం?
సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో పాటు పలువురు ప్రపంచ నేతలు హాజరయ్యారు. వీరిలో కొంతమంది సెప్టెంబర్ 11నే భారత్కు చేరుకున్నారు. అయితే, ఈ సదస్సు ముగిశాక స్వదేశాలకు వెళ్లిన కొందరు నేతలు అనారోగ్యం పాలయ్యారంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్, సౌతాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా తమ దేశాలకు వెళ్లాక బహిరంగంగా కనిపించలేదని, అధికారిక కార్యక్రమాలను సైతం రద్దు చేసుకున్నారంటూ నెట్టింట రకరకాల వదంతులు వైరల్ అయ్యాయి.
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో రకరకాల వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు న్యూఢిల్లీకి వచ్చిన ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, ఇక్కడ చికిత్స తీసుకునేందుకు ఇష్టపడక వెంటనే ప్రత్యేక విమానంలో చైనాకు వెళ్లిపోయారని నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా, ఆయన ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలపై చైనా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Fake Alert!!! 🚨🚨🚨
We caution against such malicious posts on social media platforms! https://t.co/NRu6Dfk7Yj
— MEA FactCheck (@MEAFactCheck) September 17, 2026
ఇదే సమయంలో కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు, సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా బ్రిక్స్ సదస్సుకు హాజరైన పలువురు నేతలు అనారోగ్యం పాలయ్యారంటూ ప్రచారం చేశాయి. అయితే ఈ వదంతులను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ తప్పుడు ప్రచారంపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ తాజాగా స్పందించింది. ఇదంతా పూర్తిగా అబద్ధమని, నిరాధారమైన వదంతులని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని విదేశాంగ శాఖ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది. ఇలాంటి ఫేక్ ప్రచారాల పట్ల ప్రజలు, మీడియా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆ నేతల ఆరోగ్య సమస్యలకు, ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది.