
కోల్కతా.. పశ్చిమ బెంగాల్లోని ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి సాగుతున్న విదేశీ బంగారం అక్రమ రవాణాపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. నిఘా వర్గాల సమాచారంతో సరిహద్దు ప్రాంతంలో అత్యంత పక్కాగా సాగుతున్న ఓ భారీ బంగారం స్మగ్లింగ్ ముఠా నెట్వర్క్ను డీఆర్ఐ అధికారులు విజయవంతంగా ఛేదించి, దానిని భగ్నం చేశారు. ఈ ఆపరేషన్లో దాదాపు రూ.34 కోట్ల విలువైన 24 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకోగా, ముఠాలోని ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
నడుము బెల్టుల్లో దాచి గోల్డ్ స్మగ్లింగ్
నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు, పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో ఒక రహస్య ఆపరేషన్ నిర్వహించారు. కృష్ణానగర్ నుంచి చక్దహా వైపు వేర్వేరు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులను అధికారులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు. అధికారుల తనిఖీల్లో దొరకకుండా తప్పించుకునేందుకు ఆ ఏడుగురు తమ నడుము చుట్టూ ప్రత్యేకంగా కుట్టించుకున్న బట్టల బెల్టులను ధరించారు. అధికారులు వారిని క్షుణ్ణంగా సోదా చేయగా, ఆ నడుము బెల్టుల లోపల దాచిన 180 విదేశీ మార్కు ఉన్న, రూపుమార్చిన బంగారు బిస్కెట్లుబయటపడ్డాయి.
రూ.34 కోట్ల విలువైన బంగారం
దీంతో ఆ బంగారం మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం మొత్తం సుమారు 24 కిలోలు ఉండగా, దీని మార్కెట్ విలువ దాదాపు రూ. 34 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ భారీ బంగారాన్ని కస్టమ్స్ చట్టం 1962 నిబంధనల ప్రకారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లింగ్ ముఠాలో కీలక పాత్ర పోషించిన ఏడుగురు నిందితులను అక్కడే అరెస్ట్ చేశారు.
బైక్లపై వేరే ముఠాకు సరఫరా!
ప్రాథమిక విచారణలో నిందితులు ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు సమీప ప్రాంతాల నుంచి ఈ బంగారాన్ని సేకరించినట్లు ఒప్పుకున్నారు. దీనిని మరో ప్రాంతంలో ఉండే వేరే ముఠా సభ్యులకు (డెలివరీ కోసం) అప్పగించేందుకు ద్విచక్రవాహనాలపై తరలిస్తుండగా డీఆర్ఐ అధికారులకు దొరికిపోయారు. ఈ నెట్వర్క్పై అధికారులు విచారణను మరింత ముమ్మరం చేశారు.
Gold Smuggling
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.