
రాజస్థాన్లోని కోట జిల్లాలో శుక్రవారం రాత్రి ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇటావా సబ్ డివిజన్లోని బంజారి గ్రామంలో దాదాపు 80 కిలోల బరువున్న ఆ భారీ మొసలి ఓ ఇంట్లోకి ప్రవేశించింది. కుటుంబ సభ్యులంతా టీవీ చూస్తుండగా ఆహ్వానం లేని అతిథిలా భారీ ఆకారంతో మొసలి ఇంట్లోకి దూసుకురావడంతో ఇంటిల్లిపాది భయంతో అరుపులు, కేకలు పెడుతూ పరుగులు తీశారు. ఇంట్లోని వారంతా మొసలి నోటికి చిక్కకుండా బయటకు పారిపోయారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు.
కానీ, గంటలు గడుస్తున్నప్పటికీ అధికారుల నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో గ్రామస్తులు వన్యప్రాణుల సంరక్షకుడు హయత్ ఖాన్ టైగర్కు సమాచారం అందించారు. హయత్, అతని బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు మొసలి నోటికి టేపు వేసి, దాడి చేయకుండా బంధించారు. మొసలి బంధించేందుకు వారంతా గంటసేపు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అనంతరం హయత్ ఆ మొసలిని తన భుజాలపై ఎత్తుకుని తీసుకువెళ్లాడు.. అతను అలా మొసలిని ఎత్తుకుని వీధుల్లో నడుస్తుంటే జనం చప్పట్లతో మార్మోగించారు. ఇదంతా ఏదో సినీమాలో హీరోను మించిపోయి కనిపించింది.
వీడియో ఇక్కడ చూడండి..
గ్రామంలో బంధించిన మొసలిని శనివారం ఉదయం గేటా సమీపంలోని చంబల్ నదిలో విడిచిపెట్టారు. మొసలి దాదాపు ఎనిమిది అడుగుల పొడవు, దాదాపు 80 కిలోల బరువు ఉందని చెప్పారు. ఈ గ్రామంలో ఒక సంవత్సరంలో ఇటువంటి ఘటనలు మూడుసార్లు జరిగాయని హయత్ చెప్పారు. సమీపంలోని చెరువు నుండి తరచూ మొసళ్ళు బయటకు వస్తూ నివాసితులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పారు. మొసళ్ల భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని వాపోయారు. ఏదైనా విషాదం జరగకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..