
సాధారణంగా విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ, విమానాల శబ్దాలు వినిపిస్తుంటాయి. కానీ, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనూహ్యంగా ఒక అతిథి ప్రత్యక్షమై అందరినీ హడలెత్తించింది.. ఒక కార్యాలయ గదిలోని ఏసీ యూనిట్ పైన సుమారు 7 అడుగుల భారీ జెర్రిపోతు (Rat Snake) కనిపించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక భారీ పాము ఏసీ వెనుక భాగంలో అత్యంత ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడం కనిపిస్తుంది. సిబ్బంది దీనిని గమనించి వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు. విమానాశ్రయం వంటి హై-సెక్యూరిటీ, రద్దీ ప్రాంతంలో ఇంత పెద్ద పాము ఎలా ప్రవేశించిందనేది చర్చనీయాంశంగా మారింది.
సమాచారం అందుకున్న వెంటనే వన్యప్రాణి సంరక్షణ బృందం (Snake Rescuers) రంగంలోకి దిగింది. రెస్క్యూ టీమ్ సభ్యులు ఒక స్టిక్ సహాయంతో అత్యంత నేర్పుగా ఆ పామును ఏసీ పైనుంచి కిందకు దించారు.
నిపుణుల ప్రకారం, జెర్రిపోతులు విషపూరితమైనవి కావు మరియు ఇవి సాధారణంగా ఎలుకల కోసం జనావాసాల్లోకి వస్తుంటాయి. అయితే, దాని భారీ పరిమాణం చూసి అక్కడి వారు భయాందోళనకు గురయ్యారు. పామును పట్టుకున్న అనంతరం దానికి ఎటువంటి గాయాలు కాలేదని నిర్ధారించుకుని, జనసంచారం లేని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు.
ఈ సంఘటన వల్ల విమాన సర్వీసులకు ఎటువంటి అంతరాయం కలగలేదు. వన్యప్రాణుల రక్షణ పట్ల సిబ్బంది చూపిన సమయస్ఫూర్తిని నెటిజన్లు అభినందిస్తున్నారు. విమానాశ్రయ పరిసరాల్లో పచ్చదనం ఎక్కువగా ఉండటం వల్ల ఇలాంటి వన్యప్రాణులు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయని అధికారులు తెలిపారు. కాగా, ఈ వీడియో గత ఫిబ్రవరిలో జరిగిన సంఘటనగా తెలుస్తోంది. కానీ, సోషల్ మీడియాలో మరోమారు వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు మళ్లీ మళ్లీ షేర్లు, లైకులు చేస్తూ మరింత వైరల్గా మార్చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…