
పెళ్లైన తరువాత హనీమూన్ కోసం ఆహ్లాదకరమైన ప్రాంతాలకు వెళ్లడం రొటీన్ అనుకున్నారో ఏమో ఓ జంట ట్రైన్ లోనే ఫస్ట్ నైట్ ప్లాన్ చేసుకుంది. తమ రైలు ప్రయాణాన్ని వినూత్నంగా, చిరస్మరణీయంగా మార్చుకోవాలనుకుని ఫస్ట్ ఏసీ కూపేను ఒక లగ్జరీ హనీమూన్ రూమ్లా మార్చేయాలని ప్లాన్ చేసింది. అనుకున్నదే తడవుగా ఆన్లైన్లో డెకరేటర్లను బుక్ చేసి మరీ రైలు భోగీని పూలు, బెలూన్లతో ముస్తాబు చేయించింది. ఫస్ట్ నైట్ పడక గదిని తలపించేలా అదిరిపోయేలా ఫస్ట్ ఏసీ కూపే సిద్ధమైపోయింది. దీన్ని విడియో కూడా తీసుకున్నారు. కార్యం జరిగిపోయింది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తరువాత రైల్వే అధికారులు సదరు ట్రైన్ టీసీ పై చర్యలు తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులను కోచ్లోకి అనుమతించారనే కారణంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ ఒక టికెట్ కలెక్టర్పై సస్పెన్షన్ వేటు వేసింది.
జూలై 6న దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని రైలు నెం.11002 నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ లో ఒక జంట ప్రయాణిస్తోంది. తమ ఫస్ట్ ఏసీ కూపేను ప్రత్యేకంగా అలంకరించుకోవడానికి వారు ఆన్లైన్ ద్వారా ఒక ప్రైవేట్ డెకరేటర్ను సంప్రదించారు. రైలు స్టేషన్లో ఆగిన సమయంలో సదరు డెకరేటర్ కోచ్లోకి ప్రవేశించి, ఆ జంట కూర్చున్న కూపేను పూలదండలు, రంగు రంగుల బెలూన్లతో ఒక హనీమూన్ బెడ్ తరహాలో సర్వాంగ సుందరంగా అలంకరించాడు. అయితే రైల్వే నిబంధనల ప్రకారం చెల్లుబాటు అయ్యే టికెట్ లేదా ప్లాట్ఫారమ్ టికెట్ లేకుండా, ప్రయాణీకులు కాని బయటి వ్యక్తులు రైలు కోచ్ల్లోకి ప్రవేశించడం పూర్తిగా నిషిద్ధం. భద్రతా పరంగా ఇది తీవ్రమైన లోపంగా పరిగణించబడుతుంది. రైలు అంతటా డెకరేషన్ జరుగుతున్నా, డ్యూటీలో ఉన్న టికెట్ తనిఖీదారు దీనిని గమనించకపోవడం లేదా అడ్డుకోకపోవడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గానూ సదరు టికెట్ తనిఖీదారును తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి అంతర్గత విచారణకు ఆదేశించామని అధికారులు తెలిపారు. రైల్వే భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని కోచ్లోకి అనధికారిక ప్రవేశం ఎలా సాధ్యమైందనే కోణంలో దర్యాప్తు జరుగుతోందని విచారణలో తేలే అంశాల ఆధారంగా బాధ్యులైన వారిపై తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ తెలిపింది.