Viral Photo: చెప్పులు పోయాయని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ చూసి.. తలపట్టుకోవాలో, వస్తున్న నవ్వును ఆపుకోవాలో అర్థం కాక ఇబ్బందులు పడ్డారు. అవును మరి.. సదరు వ్యక్తి తాను రాసిచ్చిన ఫిర్యాదులో అంత మంచి అంశాలను పేర్కొన్నాడు మరి. ఉజ్జయిని జిల్లాలోని ఖచ్రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ వచిత్ర సంఘటను సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ఒక్కోసారి ఫేక్ కాల్స్, విచిత్రమైన ఫిర్యాదులు పోలీసులకు వస్తుంటాయి. అవి పోలీసులను కాస్త ఇబ్బంది పెడుతుంటాయి. అయితే, తాజాగా ఇలాంటి వింత కేసు ఒకటి పోలీసులకు వచ్చింది. ఫిర్యాదారుడు తన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు చదవితే నవ్వు ఆపుకోలేని పరిస్థితి ఉంటుంది. మొబైల్ దొంగతనం, నగదు, నగలు దోపిడీ, హత్య, కిడ్నాప్, దాడి వంటి నేర ఘటనలకు సంబంధించి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం చూశాం.. మరి చెప్పులు దొంగిలించారని ఎవరైనా ఫిర్యాదు చేయడం ఎప్పుడైనా చూశారా. అయితే, ఇప్పుడు చూసేయండి.
ఉజ్జయిని జిల్లాలోని ఖచ్రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న ఓ వ్యక్తి చెప్పులను ఎవరో దుండగులు ఎత్తుకెళ్లారు. ఆ చెప్పుల విలువ రూ. 180 ఉంటుంది. తన చెప్పులు పోయిన విషయంపై సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు తన చెప్పు దొంగించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆ దొంగ తన చెప్పులను సరిగ్గా వాడకపోతే తాను బాధ్యత వహించనంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అది చూసి స్టేషన్ పోలీసు అధికారులు ఫుల్లుగా నవ్వుకున్నారు. ఆ తరువాత.. ఫిర్యాదును స్వీకరించి, తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు.
చెప్పులు దుర్వినియోగం కావచ్చు..
మీడియా కథనాల ప్రకారం.. ఖచ్రోడ్లో నివసిస్తున్న రైతు జితేంద్ర చెప్పులు చోరీకి గురికావడంతో కోపంతో పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ‘‘నా ఇంట్లో నుండి ఎవరో నా చెప్పులను దొంగిలించారు. గుర్తుతెలియని వ్యక్తి వేరే ప్రదేశంలో దొంగిలించి నా చెప్పులను అక్కడ పెడితే, ఆ కేసులో నన్ను ఇరికించవచ్చు. కావున, ఆ గుర్తుతెలియని దొంగ దొంగిలించిన నా చెప్పులను సక్రమంగా ఉపయోగించకుంటే నేను బాధ్యత వహించను’’ అని స్పష్టం చేశాడు. అంతేకాదండోయ్.. దరఖాస్తులో చెప్పుల రంగు, కంపెనీ పేరు, ధర రూ. 180/- అని పూర్తి వివరాలను పేర్కొన్నారు. అయితే, కంప్లైంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.