
వివాహ బంధం.. అంటే ఏడడుగుల జన్మల బంధం అంటారు. కష్ట సుఖాల్లో కలకాలం తోడుగా కలిసుంటామని పెళ్లినాడు ప్రమాణాలు చేసుకున్నారు. ఒకరి కోసం ఒకరిగా బతికారు. భవిష్యత్తు మీద ఎన్నో కలలు కన్నారు. ఇంతలోనే విధి వక్రీకరించింది. బంగారం లాంటి భర్తను ఆ ఇల్లాలికి దూరం చేసింది. అది కూడా తన సీమంతం రోజునే భర్త చనిపోవడం ఏ ఇల్లాలికి రాకూడని దస్థితిని ఆ మహిళ అనుభవించింది. ఈ విషాద సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
దక్షిణకన్నడ జిల్లా బంట్వాళ తాలూకా విట్ల సమీపంలోని మిత్తనడ్క గ్రామంలో సతీష్ (33) అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా తన భార్య ఇటీవలె నెల తప్పింది. ఆ సంతోషాన్ని కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో సీమంతం నిర్వహించారు. ఆ సమయంలో సతీష్ గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే మంగళూరు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా సతీష్ మృతిచెందాడు.
సతీష్ గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సతీష్ భార్య గుండెలవిసేలా రోధించింది. ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు.