
తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన వర చందనకుమార్(28) దేవధనపట్టిలో కిరాణా దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య 5ఏళ్ల కూతురు ఉన్నారు. ప్రస్తుతం అతని భార్య పండిదేవి 5నెలల గర్భవతి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 8న దుకాణం మూసివేసి ఇంటికి వచ్చిన చందనకుమార్ తన కిరాణా దుకాణం సమీపంలోని ఒక హోటల్ నుండి దోసె కొనడానికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ శివుడు అనే వంటమాస్టార్ పరోటా కోసం సిద్ధం చేస్తున్నాడు.
చందనకుమార్ హోటల్ కి వచ్చేసరికి శివుడు ఒక రాయి మీద పరోటా కోసం పిండిని తడుపుతున్నాడు. అతడు పెద్ద పెద్ద శబ్ధాలు చేస్తూ పిండి తడుపుతున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న చందనకుమార్ చిరాకుపడి శివుడిని అంత శబ్దం ఎందుకు చేస్తున్నావంటూ కాస్త గట్టిగానే అడిగాడు. అంతే అదే అతని పాలిట శాపంగా మారింది. ఎందుకు అంత శబ్ధం చేస్తున్నావని అడిగినందుకు శివుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. చందనకుమార్తో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. పరోటా విషయంలో తలెత్తిన పంచాయతీ కాస్త చినికి చినికి గాలివానగా మారింది. ఇద్దరు పరస్పరం దాడి చేసుకున్నారు. ఆ పక్కనే ఉన్న ఒక కట్టెతో చందనకుమార్ శివుడిపై దాడి చేశాడు. ఆ సమయంలో అతని తలకు తీవ్ర గాయం అయింది. నొప్పితో బాధపడుతున్న శివ తన వద్ద ఉన్న కత్తితో చందనకుమార్ను పదే పదే పొడిచాడు.
కత్తి గాట్లకు చందన కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. రక్తపు మడుగులో పడివున్న అతన్ని చూసిన పొరుగువారు వెంటనే అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతను మృతి చెందినట్లు ప్రకటించారు. గాయపడిన శివ పెరియకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దేవధనపట్టి పోలీసులు కేసు నమోదు చేసి ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..