
అయోధ్య రాముడికి భక్తులు ఎన్నో రకాల అపురూపమైన కానుకలను సమర్పిస్తుంటారు. తాజాగా, రామ్లల్లాకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జపనీస్ రకం మియాజాకీ మామిడి పండును నైవేద్యంగా సమర్పించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ మామిడి పండ్ల ధర కిలో రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు ఉంటుంది. అంటే ఒక్కో పండు విలువ దాదాపు రూ. 1 లక్ష వరకు పలుకుతుంది. విశేషం ఏమిటంటే..
జపాన్కు చెందిన ఈ మియాజాకీ రకం మామిడిని తైయో-నో-తమాగో లేదా సూర్యుని గుడ్డు (Egg of the Sun) అని కూడా పిలుస్తారు. దీని ప్రత్యేకమైన ఎరుపు-ఎరుపు రంగు, అద్భుతమైన తీపి, ఎక్కువ పీచు పదార్థం, పోషక విలువల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో దీనికి భారీ డిమాండ్ ఉంది. గ్లోబల్ మార్కెట్లో ఈ మామిడి పండ్లు కిలో రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు అమ్ముడవుతాయి. ఈ లెక్కన ఒక్కో మామిడి పండు ధర సుమారు రూ. 1 లక్ష వరకు ఉంటుంది.
ఈ అరుదైన పండు జపాన్ నుండి దిగుమతి చేసుకున్నది కాదు, అయోధ్యకు చెందిన ఓంప్రకాష్ సింగ్ అనే స్థానిక రైతు తన సొంత తోటలోనే దీన్ని విజయవంతంగా పండించారు. దాదాపు రెండేళ్ల క్రితం ఆయన మియాజాకీ మామిడి మొక్కను తెచ్చి, అయోధ్య వాతావరణానికి ఇది తట్టుకుంటుందో లేదోనని ప్రయోగాత్మకంగా నాటారు. ఆయన శ్రమ ఫలించి ఈ సీజన్లో ఆ చెట్టుకు దాదాపు డజను పండ్లు కాశాయి. ఒక్కో పండు బరువు 150 గ్రాముల నుండి 300 గ్రాముల వరకు తూగింది.
మన దేశంలో మొదటి పంటను దేవుడికి సమర్పించడం ఒక పవిత్రమైన ఆనవాయితీ. ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ, తన తోటలో పండిన మొట్టమొదటి మియాజాకీ మామిడి పండును ఓంప్రకాష్ సింగ్ తన గురువుగారితో కలిసి వెళ్లి రాముడికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ మహంత్ సీతారాం దాస్ జీ మాట్లాడుతూ.. ఈ మామిడి పండు రంగు సూర్య భగవానుడి కాంతిని పోలి ఉందని, విశ్వాన్ని ప్రకాశింపజేసే రాముడికి సూర్య వర్ణంలో ఉన్న ఈ పండ్ల రాజును సమర్పించడం ఎంతో అద్భుతమైన విషయమని కొనియాడారు. అయోధ్య మట్టిలో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి పంటలు పండటం వ్యవసాయ రంగంలో ఒక గొప్ప మైలురాయి అని నిపుణులు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..