ఖడ్గమృగాన్ని దగ్గరగా చూడాలనుకుంటే చావును చూసినట్టే..! ఊహించని దాడితో ఉలిక్కిపడ్డ సఫారీ

వన్యప్రాణులను దగ్గరగా చూడాలనే ఇష్టం కొన్నిసార్లు ఎంత నష్టదాయకంగా పరిణమిస్తుందో చూపించే ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఒక వన్యప్రాణి పార్కులో కొంతమంది పర్యాటకులు సఫారీ జీపులో హాయిగా కూర్చుని, తమ కెమెరాలతో ఫోటోలు తీసుకుంటున్నారు. ఇంతలో ఆ వాహనం ఒక భారీ ఖడ్గమృగానికి చాలా దగ్గరగా వచ్చింది. దాంతో తనకు ప్రమాదం పొంచి ఉందని భావించిన ఆ క్రూర జంతువుకు కోపం కట్టలు తెంచుకుని, అది నేరుగా జీపుపైకి దూసుకెళ్లింది. ఆ ఖడ్గమృగం తన పూర్తి శక్తిని ఉపయోగించి దాని కొమ్ములతో వాహనాన్ని అమాంతంగా ఎత్తి పడేసింది..ఆ వాహనం గడ్డిపోచలా ఎగిరిపోయింది! లోపల ఉన్న జనం భయంతో కేకలు వేశారు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..!

ఖడ్గమృగాన్ని దగ్గరగా చూడాలనుకుంటే చావును చూసినట్టే..! ఊహించని దాడితో ఉలిక్కిపడ్డ సఫారీ
Assam Safari Incident

Updated on: May 19, 2026 | 3:17 PM

అస్సాంలోని ప్రసిద్ధ వన్యప్రాణి కేంద్రం మానస్ నేషనల్ పార్క్ (Manas National Park) లో జరిగిన ఓ సంచలన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. అడవి సఫారీకి వెళ్లిన పర్యాటకుల జీప్‌పై ఓ భారీ ఖడ్గమృగం ఒక్కసారిగా దాడి చేయడంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెటిజన్లను తీవ్ర షాక్‌కు గురిచేస్తోంది. అసలేం జరిగిందంటే?

మనకు అందిన సమాచారం ప్రకారం.. మానస్ నేషనల్ పార్క్‌లోని బన్స్‌బారి రేంజ్ ప్రాంతంలో కొందరు పర్యాటకులు ఓపెన్ సఫారీ జీప్‌లో అడవిని సందర్శిస్తున్నారు. ఆ సమయంలో సమీపంలో ఉన్న ఒక ఖడ్గమృగం ఆకస్మికంగా ఆగ్రహానికి లోనైంది. క్షణాల వ్యవధిలోనే అది జీప్‌వైపు వేగంగా దూసుకొచ్చి, తన బలమైన కొమ్ముతో వాహనాన్ని పదే పదే ఢీకొట్టింది. జీప్‌ను పైకి ఎత్తి, బోర్లా తిప్పేయడానికి కూడా అది ప్రయత్నించినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీంతో జీప్‌లో ఉన్న పర్యాటకులు ప్రాణభయంతో గట్టిగా కేకలు వేశారు.

ఇవి కూడా చదవండి

ఈ ఉత్కంఠభరితమైన తరుణంలో సఫారీ జీప్ డ్రైవర్ అత్యంత అప్రమత్తంగా, సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. ఖడ్గమృగం దాడి చేస్తున్నప్పటికీ ఏమాత్రం పానిక్ అవ్వకుండా, వెంటనే జీప్‌ను రివర్స్‌ గేర్ వేసి వేగంగా వెనక్కి తీసుకెళ్లాడు. దీంతో ఖడ్గమృగం దాడి నుంచి పర్యాటకులు తృటిలో సురక్షితంగా బయటపడ్డారు. ఈ తృటిలో తప్పిన ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అటవీ అధికారులు వెల్లడించారు.

వీడియో ఇక్కడ చూడండి..

సాధారణంగా ఖడ్గమృగాలు ప్రశాంత స్వభావం కలిగి ఉంటాయని, కానీ తమకు లేదా తమ పిల్లలకు ముప్పు ఉందని భావించినప్పుడు, లేదా మనుషులు తమకు అతిగా దగ్గరకు వచ్చినప్పుడు అవి ఇలా రౌద్రరూపం దాలుస్తాయని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అడవి సఫారీల భద్రతపై మళ్లీ చర్చ మొదలైంది. ప్రస్తుతం అటవీ శాఖ ఈ ఘటనపై విచారణ చేపట్టింది. అడవి జంతువుల సహజ ఆవాసాల్లోకి వెళ్లినప్పుడు వాటికి తగినంత దూరం పాటించడం ఎంత ముఖ్యమో ఈ వైరల్ వీడియో మరోసారి గుర్తుచేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us