చిన్నప్పుడు పొట్టపగిలేలా నవ్వుకున్న ‘రెక్కల ఏనుగు’ గుర్తుందా..? 90’s కిడ్స్‌కి ఇష్టమైన కథ

Rekkala Enugu Story: దురాశ, అజాగ్రత్త, అతిశయోక్తి వల్ల మన చేతిలో ఉన్న అవకాశాలు కూడా పోతాయి. వినయం, సమయస్ఫూర్తి, జాగ్రత్త విజయానికి అవసరమని చెప్పే నీతి కథ ఇది. ఇప్పటి వాళ్లకు తెలియదుగానీ.. 90's కిడ్స్‌కి ఎంతో ఇష్టం ఈ కథ. బొమ్మ చూడగానే ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది కదా.. అదే రెక్కల ఏనుగు కథ. మళ్లీ ఓసారి ఈ కథను చదివి హాయిగా నవ్వుకుందాం..

చిన్నప్పుడు పొట్టపగిలేలా నవ్వుకున్న రెక్కల ఏనుగు గుర్తుందా..? 90s కిడ్స్‌కి ఇష్టమైన కథ
Rekkala Enugu Story

Updated on: Jul 06, 2026 | 2:25 PM

ఒక ఊరిలో రాజు గారి చెరకు తోట ఉండేది. ఆ తోటలో సూరయ్య, భార్య నరసమ్మ కాపలా ఉండేవారు. అయితే ప్రతిరోజూ రాత్రి ఎవరో వచ్చి తోటలోని చెరకు గడలను తిని పాడుచేస్తుండటాన్ని సూరయ్య గమనిస్తాడు. రాజుకు తెలిస్తే శిక్ష తప్పదని భయపడ్డాడు. దొంగను పట్టుకోవాలనే ఉద్దేశంతో రోజూ సూరయ్య మాటు వేసి కాపలాకాయసాగాడు. పున్నమిరాత్రి వచ్చింది. వెన్నెల పిండారబోసినట్లు ఉంది. ఆ రోజు రాత్రి కూడా సూరయ్య తోటలోనే దాక్కుని కాపలా కాస్తున్నాడు. అర్ధరాత్రి అయ్యేసరికి ఆకాశం నుంచి ఓ వెలుగు తోటలోకి పడింది. ఆ వెలుగులో నుంచి రెక్కలున్న ఒక తెల్లటి అందమైన ఏనుగు మెల్లగా కిందకు దిగడం చూసి సూరయ్య ఆశ్చర్యపోయాడు. అది స్వర్గం నుండి వచ్చే ఐరావతం. అది తోటలోకి వచ్చి ఎంతో ఇష్టంగా తనకు నచ్చిన చెరకు గడలను తినడం మొదలుపెడుతుంది.

తెలవారుతుండగా.. ఏనుగు ఒక్కసారిగా ఘింకరించి తిరిగి ఆకాశంలోకి ఎగిరింది. వెంటనే సూరయ్య ధైర్యం చేసి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ ఏనుగు తోకను గట్టిగా పట్టుకుంటాడు. ఏనుగుతో పాటు సూరయ్య కూడా ఆకాశంలోకి ఎగిరి నేరుగా వింత లోకానికి తీసుకెళ్లాడు. అక్కడ అంతా బంగారు మయం. జంతువులు ఎగురుతున్నాయి. పక్షలు మాట్లాడుతున్నాయి. పాములు పడగలపై నిలబడి నాట్యం చేస్తున్నాయి. సూరయ్య కోరిందే తడవుగా అన్ని ప్రత్యక్షమయ్యాయి. తనకు కావల్సినవన్నీ మూట కట్టుకున్నాడు. మళ్లీ పున్నమి వచ్చింది. ఏనుగు తోక పట్టుకుని మళ్లీ భూలోకం వచ్చాడు.

సూరయ్య తెచ్చిన ఆ స్వర్గలోకపు సంపదను ఊరిలోని జనాలందరికీ చూపిస్తాడు. కొంత మంది సూరయ్య మాటలు వినలేదు. వారందరినీ వింతలోకం తీసుకెళ్తానని చెబుతాడు. పున్నమిరోజు వారందరినీ తోటకు రమ్మని చెబుతాడు. పున్నమిరోజు రానేవచ్చింది. అందరూ చూస్తుండగా రెక్కల ఏనుకు రానేవచ్చింది. తనకు కావల్సిన మేసి తెలవారుజామున ఘీంకరించి ఆకాశం వైపు ఎగిరింది. వెంటనే సూరయ్య రెక్కల ఏనుగు తోక పట్టుకున్నాడు. అతని కాలును నరసమ్మ, ఆమె కాలును మరొకరు ఇలా అందరూ పట్టుకుని గాల్లో వేలాడసాగారు. చివరలో మల్లమ్మ వేలాడుతుంది.

ఆకాశంలో ఎగురుతున్న సమయంలో.. మల్లమ్మకు ఒక సందేహం వచ్చింది. వింతలోకంలో గుమ్మడికాయ ఎంత సైజులో ఉంటాయి? అని పైనున్న వ్యక్తిని అడిగింది. అతడు ఆపై ఉన్న వారిని.. అలా సూరయ్యకు ఆ ప్రశ్న చేరుతుంది. సూరయ్య తాను గాల్లో ఉన్నానన్న సంగతి మర్చిపోయి ఉత్సాహంగా.. ఇంతింత పెద్దగా ఉంటాయి అని రెండు చేతులు చూపిస్తూ.. ఏనుగు తోకను వదిలేస్తాడు. ఇంకేముంది.. ఒకరి తర్వాత ఒకరు అందరూ నేలపై పడిపోయారు.

నీతి

దురాశకు పోయి, అజాగ్రత్తగా వ్యవహరిస్తే ఉన్నది కూడా ఊడిపోతుందనేది ఈ కథలోని నీతి. దురాశకు పోయి, సమయస్ఫూర్తి కోల్పోయి, తొందరపడి వ్యవహరిస్తే చేతిలో ఉన్న అవకాశాలు కూడా పోతాయి. రహస్యాలను, విజయాలను గొప్పగా చెప్పుకోవడం వల్ల అనవసర సమస్యలు వస్తాయి. తెలివిగా సంపాదించిన దానిని వినయంగా ఉపయోగించాలి. ప్రదర్శన కోసం ప్రయత్నిస్తే నష్టం కలుగుతుంది.

Follow Us