రూ.100నోటుపై ఉన్నఈ కట్టడం..700 ఏళ్లు మట్టిలో దాగిన అద్భుతం.. ఇప్పుడు 3D వెలుగుల్లో మెరిసిపోతోంది..

ఆకాశానికి ఎగబాకకుండా, భూమిలోకి లోతుగా దిగిపోయే కట్టడాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? మన దేశ రూ.100 నోటు వెనుక ముద్రితమైన ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం. ఇప్పుడు రూ.18 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక 3D ప్రొజెక్షన్ లైట్ షోతో రాత్రి వేళల్లో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. శతాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉన్న ఈ 11వ శతాబ్దపు స్మారక చిహ్నం, ఇప్పుడు ఒక హై-టెక్ అనుభవంతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ విశిష్టమైన వారసత్వ సంపద కథను తెలుసుకుందాం...

రూ.100నోటుపై ఉన్నఈ కట్టడం..700 ఏళ్లు మట్టిలో దాగిన అద్భుతం.. ఇప్పుడు 3D వెలుగుల్లో మెరిసిపోతోంది..
Rani Ki Vav Light Show

Updated on: Jul 10, 2026 | 11:49 AM

సాధారణంగా ఏదైనా ఒక చారిత్రక భవనం లేదా ఆలయం ఆకాశం వైపు ఎత్తుగా పెరుగుతుంది. కానీ, భూమి లోపలికి లోతుగా వెళ్లే ఏడు అంతస్తుల భారీ ‘తిరగబడిన ఆలయం’ (Inverted Temple) గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? గుజరాత్‌లోని పటాన్ నగరంలో సరస్వతి నది ఒడ్డున ఉన్న “రాణి కీ వావ్” (రాణి బావి) అచ్చం అలాంటి ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ మరియు శిల్పకళా చమత్కారం. మన జేబుల్లో ఉండే ₹100 నోటు వెనుక ముద్రించబడిన ఈ చారిత్రక కట్టడం వెనుక ఒక అద్భుతమైన కథ దాగి ఉంది.

ప్రేమకు ప్రతీకగా 20 ఏళ్ల నిర్మాణం:

యునెస్కో (UNESCO), ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) కథనం ప్రకారం.. 11వ శతాబ్దంలో చాళుక్య వంశానికి చెందిన రాజు భీమ్‌దేవ్-1 మరణానంతరం, ఆయన జ్ఞాపకార్థం భార్య రాణి ఉదయమతి క్రీ.శ 1063లో ఈ బావి నిర్మాణాన్ని ప్రారంభించారు. అత్యంత అద్భుతమైన మారు-గుర్జర నిర్మాణ శైలిలో, సుమారు 65 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 27 మీటర్ల లోతుతో నిర్మితమైన ఈ మెగా కట్టడం పూర్తి కావడానికి ఏకంగా 20 ఏళ్లు పట్టింది.

 

ఇవి కూడా చదవండి

700 ఏళ్ల పాటు మట్టిలోనే సురక్షితం:

13వ శతాబ్దంలో సరస్వతి నది ప్రవాహ మార్గం మారడం వల్ల వచ్చిన భారీ వరదలతో ఈ 7 అంతస్తుల బావి పూర్తిగా బురద, మట్టి కింద దారి తప్పిపోయి దఫనమైంది. కానీ, ఈ ప్రకృతి వైపరీత్యమే దీనికి ఒక వరంగా మారింది. ఆ దట్టమైన మట్టి పొరలు ఒక సురక్షితమైన లాకర్‌లా పనిచేసి, లోపల ఉన్న అమూల్యమైన శిల్పకళను దొంగల బారిన పడకుండా, శతాబ్దాల పాటు ప్రకృతి శక్తుల వల్ల పాడవకుండా దాదాపు 700 సంవత్సరాల పాటు కాపాడాయి. 1940లలో దీనిని మళ్లీ కనుగొనగా, 1980లలో ASI దీనిని పూర్తిగా తవ్వి తీసి పునరుద్ధరించింది.

400 అద్భుత శిల్పాలు, 3D లైట్ షో:

ఈ బావి గోడలు, స్తంభాలపై ఒకప్పుడు 800కు పైగా శిల్పాలు ఉండేవి. ప్రస్తుతం దాదాపు 400 శిల్పాలు ఎంతో అద్భుతమైన స్థితిలో ఉన్నాయి. ఇందులో హిందూ దేవీదేవతలు, అప్సరసల రూపాలతో పాటు, శేషనాగుపై శయనించిన విష్ణుమూర్తి విగ్రహం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. 2014లో దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.

తాజాగా గుజరాత్ ప్రభుత్వం రూ.18 కోట్ల వ్యయంతో ఈ చారిత్రక కట్టడం వద్ద అత్యాధునిక 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్, హెరిటేజ్ లైటింగ్ షోను ప్రారంభించింది. 24 నిమిషాల నిడివి గల ఈ అద్భుతమైన షో ద్వారా రాత్రి వేళల్లో ఈ రాణి కీ వావ్ గోడలు తమ కథను తామే వివరిస్తున్నట్లుగా జీవం పోసుకుంటున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో ఉచితంగా ప్రదర్శించే ఈ లైట్ షోను తిలకించడానికి పర్యాటకులు దేశవిదేశాల నుండి భారీగా తరలివస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us