
అమెరికాకు చెందిన చెరిష్ అనే మహిళ జైపూర్లోని జోహ్రీ బజార్లో బంగారు దుకాణం యజమాని నుంచి బంగారు పాలిష్తో కూడిన అభరణాలను కొనుగోలు చేసింది. అయితే వాటికి అక్షరాలా 6 కోట్ల రూపాయలు వెచ్చించింది. విదేశీ మహిళను ఆ నగల వ్యాపారి నిట్ట నిలువునా మోసం చేశాడు. నాణ్యమైన బంగారు నగల పేరుతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు కోట్ల రూపాయల దోపిడికి పాల్పడ్డాడు.
అమెరికాలో ఆ మహిళ ఓ ఎగ్జిబిషన్లో ఆ ఆభరణాలను ప్రదర్శించింది. ఈ క్రమంలో అవి నకిలీవని తేలింది. వాటి విలువ కేవలం రూ. 300 మాత్రమేనని తెలిసి షాక్కు గురైంది. వెంటనే సదరు మహిళ జైపూర్కి వచ్చి షాప్ యజమాని గౌరవ్ సోనీని నిలదీసింది. దుకాణం యాజమాని ఆమె ఆరోపణలను కొట్టిపారేసాడు. దీంతో చెరిష్.. జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే యూఎస్ ఎంబసీ అధికారుల నుంచి కూడా సహాయం కోరింది. స్పందించిన అధికారులు ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా జైపూర్ పోలీసులను కోరారు.
2022లో ఇన్స్టాగ్రామ్ ద్వారా గౌరవ్ సోనీతో పరిచయం ఏర్పడిందని.. గత రెండేళ్లుగా ఆభరణాల కోసం రూ. 6 కోట్లు చెల్లించినట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం గౌరవ్, అతని తండ్రి రాజేంద్ర సోనీ పరారీలో ఉండగా.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇది చదవండి: ఉన్నట్టుండి నిద్రపోతున్న చిన్నారి ఉయ్యాల పైకెక్కిన కింగ్ కోబ్రా.. ఆ తర్వాత ఇది సీన్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి