
అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో ఎవరూ ఊహించలేరు. నిన్నటి వరకు కూరగాయలు అమ్ముకుంటూ పూట గడవడమే కష్టంగా బతుకుతున్న ఓ సామాన్యుడి తలుపు తట్టింది. అదీ మామూలుగా కాదు.. ఏకంగా రూ.11 కోట్ల బంపర్ బహుమతి రూపంలో! పంజాబ్ ప్రభుత్వం నిర్వహించిన దీపావళి బంపర్ లాటరీలో రాజస్థాన్కు చెందిన కూరగాయల వ్యాపారి అమిత్ సెహరా విజేతగా నిలిచారు. రతన్ లాటరీ కేంద్రం నుంచి టికెట్ కొనుగోలు చేసిన అమిత్ ఏకంగా 11 కోట్లు సొంతం చేసుకున్నారు. అయితే లాటరీ విజేతను ప్రకటించిన సమయంలో విజేత వివరాలు నిర్వాహకులకు తెలియలేదు. కానీ, తాజాగా అమిత్ లాటరీ ఆఫీసుకు వచ్చి రుజువులు సమర్పించడంతో వివరాలు తెలిశాయి.
ఫలితంగా దాదాపు నాలుగు రోజుల తర్వాత విజేత వివరాలు బయటకువచ్చాయి. తన భార్య, పిల్లలతో కలిసి పంజాబ్కు వచ్చి క్లైయిమ్ చేశారు. అయితే, లాటరీ ఆఫీసుకు వచ్చేందుకూ తన దగ్గర సరిపడా డబ్బుల్లేక ఇన్నాళ్లు రాలేకపోయానని అమిత్ చెప్పినట్టు నిర్వాహకులు తెలిపారు. స్నేహితుడి దగ్గర అప్పు తీసుకొని ఆయన ఈ టికెట్ కొన్నాడని చెప్పుకొచ్చారు.
ఇక కూరగాయల వ్యాపారం చేసే అమిత్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావడంతో అతడి కుటుంబ సభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమిత్ కు భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ మొత్తం డబ్బును తమ పిల్లల చదువులకు ఖర్చు చేస్తానని చెప్పుకొచ్చాడు అమిత్. అంతేకాకుండా అప్పు ఇచ్చిన స్నేహితుడి కుమార్తెల పేరిట చెరో రూ.50 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేందుకూ ముందుకు వచ్చారు.