
మనం ఎన్నో అమానవీయ ఘటనల గురించి వింటుంటాం కానీ, ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన మాత్రం విన్న ప్రతీ ఒక్కరి కళ్ళలో నీళ్లు తెప్పిస్తుంది. చనిపోయిన తన సోదరి అకౌంట్లో ఉన్న కేవలం 19,300 రూపాయల కోసం, ఒక నిరుపేద ఆదివాసి వ్యక్తి ఆమె అస్థిపంజరాన్ని తవ్వి తీసి, మూడు కిలోమీటర్ల దూరం భుజాన మోసుకుని బ్యాంకుకు వెళ్ళాడంటే నమ్ముతారా? ఇది ఏదో సినిమా సీన్ కాదు, మన సమాజంలోని వ్యవస్థలు పేదల పట్ల ఎంత కఠినంగా ఉన్నాయో చెప్పడానికి ఒక చేదు నిజం.
ఇది చదవండి: కరివేపాకు మొక్క పెరగడం లేదా.? ఇవి ఇచ్చారంటే పచ్చగా, వద్దన్నా గుబురుగా పెరుగుతుంది..
వివరాల్లోకి వెళ్తే, దియానాలి గ్రామానికి చెందిన జితు ముండా అనే వ్యక్తికి సోదరి కాక్రా ముండా మాత్రమే మిగిలి ఉన్న ఏకైక బంధువు. ఆమె భర్త, పిల్లలు ఇదివరకే చనిపోయారు. రెండు నెలల క్రితం కాక్రా ముండా కూడా అనారోగ్యంతో కన్నుమూసింది. ఆమెకు ఒడిశా గ్రామీణ బ్యాంక్, మల్లిపాసి బ్రాంచ్లో కొంచెం డబ్బు ఉంది. నిరుపేద జితుకు ఆ డబ్బు చాలా అవసరం. అయితే, బ్యాంకుకు వెళ్ళిన అతనికి మేనేజర్ నుంచి ఎదురైన సమాధానం ఒక్కటే.. “డబ్బులు కావాలంటే అకౌంట్ హోల్డర్ అయినా రావాలి, లేదా చట్టపరమైన వారసుల ధృవీకరణ పత్రాలు అయినా ఉండాలి”. చదువు లేని జితుకు డెత్ సర్టిఫికేట్ గురించి కానీ, కోర్టు పేపర్ల గురించి కానీ ఏమీ తెలియదు.
పదే పదే తిరిగినా బ్యాంకు వారు కనికరించలేదు. “అకౌంట్ హోల్డర్ రావాలి” అనే మాటను అతను అక్షరాలా తీసుకున్నాడేమో.. నిస్సహాయ స్థితిలో ఉన్న జితు స్మశానానికి వెళ్ళి తన సోదరి మృతదేహం అవశేషాలను తవ్వి తీశాడు. ఆ ఎముకలను ఒక గుడ్డలో చుట్టి, మండుతున్న ఎండలో మూడు కిలోమీటర్ల దూరం మోసుకుంటూ బ్యాంకు గడప తొక్కాడు. ఆ దృశ్యాన్ని చూసిన గ్రామస్థులు, ఇతర కస్టమర్లు ఒక్కసారిగా విస్తుపోయారు. కొందరు ఏడ్చేశారు, మరికొందరు బ్యాంకు సిబ్బంది అమానవీయ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కాగితాల కోసం ఒక మనిషిని ఇంతటి నరకానికి గురిచేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని మానవీయ కోణంలో ఈ విషయాన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇది చదవండి: అప్పు ఇస్తున్నారా.? ప్రామిసరీ నోటు మీద ఇది లేకపోతే.. చిత్తు కాగితంతో సమానం..