
ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో ట్రెండింగ్లో ఉంటుంది. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని వింతగా ఉంటాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక అమ్మాయి చూపించిన మార్కెట్ను చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. నిజానికి ఆ మార్కెట్లో కూరగాయలు, పండ్లు లేదా కోడి-చేపలు కాదు.. ఏకంగా మొసళ్ళు అమ్ముతున్నారు. అవును ఈ వింత మార్కెట్ థాయిలాండ్లో ఉంది. ఇక్కడ ప్రజలు మొసలి మాంసాన్ని చాలా ఇష్టంగా తింటారట.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో సదరు అమ్మాయి ఆ వింత మొసలి మార్కెట్ను చూపిస్తుంది. అక్కడ టేబుళ్లపై ఉన్న జంతువులను చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. తాను థాయిలాండ్కు వచ్చానని, అక్కడి మార్కెట్లో మొసళ్లను అమ్ముతున్నారని చెబుతుంది. టేబుల్పై ఉంచిన మొసలి తలలను చూపిస్తూ, ప్రజలు మొసళ్లను తిన్నారని.. వాటి తలలను కేవలం అలంకరణ కోసం మాత్రమే ఉంచారని వివరిస్తుంది. ఈ సమయంలో ఒక దుకాణదారుడు ఆ అమ్మాయిని ఏ మొసలి తినాలనుకుంటున్నావని అడిగాడు. దానికి ఆ అమ్మాయి భయంతో వెంటనే ఏమి వద్దు అని చెప్పింది. అంతేకాకుండా అక్కడి దుకాణాల్లో మొసలి దంతాలు కూడా అమ్ముతారని ఆ అమ్మాయి చెప్పింది.
ఈ వింత వీడియో ఇన్స్టాగ్రామ్లో సంజలిక అనే ఐడి నుండి షేర్ చేశారు. దీన్ని ఇప్పటివరకు 15 మిలియన్లకు పైగా మంది వీక్షించారు. లక్షల్లో లైక్లు, వేలల్లో కామెంట్లు వచ్చాయి. “సోదరా ఇక్కడి ప్రజలు చికెన్, మటన్ చూసి గందరగోళం చెందుతున్నారు.. కానీ ఈ వ్యక్తులు ఏకంగా మొసళ్ళను కూడా తింటారు” అని రాశారు. “మీకు మొసలి తినడానికి ధైర్యం ఉంటే, మీరు ప్రపంచంలో ఏదైనా తినవచ్చు” అని మరొకరు కామెంట్ చేశారు. కొంతమంది యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇలాంటి ప్రమాదకరమైన జీవులను తినడం వల్ల ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఈ మొసలి మార్కెట్ వీడియో ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..