వారాహి అమ్మవారు నీళ్లు తాగుతున్న వీడియో నెట్టింట వైరలైన విషయం తెలిసిందే.. తాజాగా.. మరోచోట వారాహి అమ్మవారి విగ్రహం పానకం తాగింది.. దీనికి సంబంధించిన వీడియో సైతం వైరల్ అవుతోంది. అమ్మవారి విగ్రహం పానకం తాగిన ఘటన అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగింది. బ్రాహ్మణ వీధిలో వారాహి నవరాత్రుల్లో అమ్మవారు పానకం తాగినట్లు వీడియో వైరల్ అయ్యింది. పీలేరులోని శివాలయం పూజారి కుమారస్వామి ఇంట్లో ఈ ఘటన జరిగింది. వారం రోజులుగా వారాహి దేవి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు.. ఈ క్రమంలో.. పూజారి అమ్మవారి విగ్రహం ముందు పానకం ఉంచగా.. విగ్రహం పానకాన్ని స్వీకరించింది.. ఇది గుర్తించిన అర్చకుడు కుమార స్వామి భార్య లక్ష్మి.. ఈ విషయాన్ని అందరికీ చెప్పింది. దీంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యింది. అర్చకుడు కుమారస్వామి ఇంట్లో జరిగిన ఈ వింతను చూసేందుకు ఆయన ఇంటికి జనం క్యూ కట్టారు.
ఇదిలాఉంటే.. విశాఖపట్నంలోని సింహాద్రిపురంలో ఓ ఇంట్లో వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో అమ్మవారికి నీరు పట్టిస్తుండగా.. ఆ నీటిని అమ్మవారు తాగేశారు. దాంతో, కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. పలువురు అమ్మవారికి నీరు తాగించారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఇది అమ్మవారి మహిమే అంటూ భక్తులు పేర్కొంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..