
వారణాసి, జూన్ 25: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గంగానదిలో పడవపై చికెన్ వండి బీర్ తాగుతున్నట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీయగా, పలువురు భక్తులు, స్థానికులు మతపరమైన మనోభావాలను దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. దశాశ్వమేధ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) అతుల్ అంజన్ త్రిపాఠి తెలిపిన వివరాల ప్రకారం..
వారణాసిలో గంగానదిలో పడవపై చికెన్ వండి బీర్ తాగుతున్నట్లు కనిపించిన వీడియో వైరల్ కావడంతో దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అందులో కనిపించిన వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఘటనలో ఉపయోగించిన పడవను కూడా స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిని దీపక్ కుమార్, అజయ్ సాహ్ని, అరుణ్ కుమార్ సాహ్ని, అనురాగ్ నిషాద్, రాహుల్ సాహ్నిలుగా గుర్తించారు. వీరి వయస్సు 25 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉంది. కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయిన సదరు వీడియోలో గంగానది మధ్యలో పడవపై చికెన్ వండుతూ, బీర్ సేవిస్తున్నట్లు కనిపించింది. ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారణాసి నగరం, గంగానది హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఆకతీయిల బీర్ పార్టీ మతపరమైన భావాలను దెబ్బతీసిందని పలువురు వ్యాఖ్యానించారు.
वाराणसी के दशाश्वमेध घाट पर BJP पार्षद और BJP नेताओं ने नाव पर गंगा नदी में मीट मुर्गे और शराब की पार्टी की
लेकिन, इससे किसी की भावना आहत नहीं हुईं
इसी गंगा नदी पर नाव में इफ्तार करने के लिए 12 मुसलमानों को ईद के ठीक पहले गिरफ़्तार करके 2 महीने जेल में रखा था
पाखंडी कहीं के pic.twitter.com/jSea4Epmuy
— Supriya Shrinate (@SupriyaShrinate) June 23, 2026
ఇదిలా ఉండగా, ఇటీవల వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర శ్రావణ మాసం ప్రారంభానికి ముందు నగర పరిధిలోని అన్ని మాంసం, చేపలు, పౌల్ట్రీ దుకాణాలను నగర శివార్లకు తరలించాలని నిర్ణయించింది. నగరంలో ప్రస్తుతం 350 నుంచి 400 వరకు మాంసం, చేపలు, పౌల్ట్రీ దుకాణాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ దుకాణాల కోసం రామ్నగర్, సుజాబాద్, గణేశ్పూర్, అవలేశ్పూర్, శివ్పూర్ ప్రాంతాల్లో ఐదు ప్రత్యేక ప్రదేశాలను గుర్తించారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో నగరంలోని మాంసం దుకాణాలు మూసివేయాల్సి రావడంతో వ్యాపారులు ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని అధికారులు పేర్కొన్నారు. దుకాణాలను నగర శివార్లకు తరలించడం ద్వారా వ్యాపారులు తమ వ్యాపారాలను కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయంపై స్థానిక ప్రజలు, వ్యాపారులు, రాజకీయ నాయకుల నుంచి మద్దతుతో పాటు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. గంగానదిలో జరిగిన తాజా ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.