Viral Video: సింహం నోటిలో చేయి.. కాళ్లపై పంజా.. అయినా బతికి బయటపడ్డ రైతు! గుండె జారిపోయే వైరల్ వీడియో!

మీరు వీధిలోకి రాగానే ఒక భారీ సింహం అకస్మాత్తుగా మీపై దాడి చేసి, మిమ్మల్ని కిందపడేసి, మీ చేతిని నోటితో కరచుకుని మీ పైనే కూర్చుంటే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది కదూ! సరిగ్గా ఇలాంటి భయానక సంఘటనే గుజరాత్‌లో సంభవించింది. ఒక క్రూరమైన ఆడ సింహం ఒక రైతును అరగంట పాటు తన ఆధీనంలో ఉంచుకుంది. చుట్టుపక్కల వారు భయంతో కేకలు వేసినా, ఎవరూ దాని దగ్గరికి వెళ్లే ధైర్యం చేయలేకపోయారు. ఈ గూస్‌బంప్స్ తెప్పించే ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలేం జరిగింది?

Viral Video: సింహం నోటిలో చేయి.. కాళ్లపై పంజా.. అయినా బతికి బయటపడ్డ రైతు! గుండె జారిపోయే వైరల్ వీడియో!
Lion Attack On Farmer

Updated on: Jul 07, 2026 | 8:37 AM

గుజరాత్‌లో ఒక భయానక ఘటన వెలుగుచూసింది. గరడియా గ్రామానికి చెందిన కాలుభాయ్ అనే రైతు తన పశువులకు మేత వేస్తుండగా, పొదల్లో నుంచి అకస్మాత్తుగా ఒక ఆడ సింహం వచ్చి అతనిపై దాడి చేసింది. ఆ సింహం అతని కాళ్లను పంజాతో, చేతిని నోటితో నొక్కిపట్టి దాదాపు అరగంట పాటు అతనిపైనే కూర్చుండిపోయింది. చుట్టుపక్కల ప్రజలు పెద్దగా కేకలు వేస్తూ, కర్రలు ఊపుతున్నప్పటికీ సింహం కదల్లేదు. ఈ ఘోర ఉదంతం భావ్‌నగర్ జిల్లా పాలిటానా తాలూకా పరిధిలోని గరడియా గ్రామంలో సోమవారం ఉదయం జరిగింది. కాలుభాయ్ బొగాభాయ్ పర్మార్ అనే పశుపోషకుడు తన ఇంటి సమీపంలో ఆవులకు మేత వేస్తున్న సమయంలో, పక్కనే ఉన్న పొదల్లో నుంచి ఒక ఆడ సింహం అకస్మాత్తుగా అతనిపైకి దూకింది. సింహం తన పదునైన పంజాలను కాలుభాయ్ కాళ్లలోకి గుచ్చి, అతని చేతిని నోటితో గట్టిగా పట్టుకుని కిందపడేసింది.

ఈ దాడిని గమనించిన పొరుగువారు పెద్దగా కేకలు వేస్తూ గ్రామస్తులను అప్రమత్తం చేశారు. క్షణాల వ్యవధిలో అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. వారు కర్రలు ఊపుతూ, గట్టిగా అరుస్తూ సింహం దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నించారు. కానీ, ఆ సింహం మాత్రం కాలుభాయ్‌ను వదలకుండా దాదాపు 30 నిమిషాల పాటు అతనిపైనే కూర్చుండిపోయింది. ఈ క్రమంలో కాలుభాయ్ శరీరం నుంచి రక్తం కారుతున్నా, అతను ఏమాత్రం భయపడి ఎదురుదాడి చేయకుండా చాలా సంయమనంతో, నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతని సహనమే అతని ప్రాణాలను కాపాడింది.

ఇవి కూడా చదవండి

చివరకు, జనం చేస్తున్న గోల భరించలేక ఆ సింహం కాలుభాయ్‌ను వదిలిపెట్టి, పక్కనే కట్టేసి ఉన్న ఒక ఆవు వైపు వెళ్లి, దానిని వేటాడి తిని వెళ్ళిపోయింది. సింహం దూరంగా వెళ్ళగానే గ్రామస్తులు వెంటనే కాలుభాయ్‌ను పాలిటానా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయాలు తీవ్రంగా ఉండటంతో అతడిని భావ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు కాలుభాయ్ ధైర్యాన్ని కొనియాడుతున్నారు. సింహం పట్టుకున్నప్పుడు అతను కంగారుపడి చేతులు, కాళ్లు కొట్టుకుని ఉంటే, సింహం మరింత రెచ్చిపోయి ప్రాణాలు తీసేసేదని, కానీ అతను ఎంతో తెలివిగా, నిశ్చలంగా ఉండి సింహం తలను నిమురుతూ శాంతింపజేయడం వల్లే బతికి బయటపడ్డాడని అభిప్రాయపడుతున్నారు. గిర్ జాతీయ పార్కు సరిహద్దుల్లో సింహాల జనాభా పెరగడం వల్ల మానవ-వన్యప్రాణుల ఘర్షణలు ఎక్కువవుతున్నాయని, అటవీ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us