ఈడీ దాడులు.. 9వ అంతస్తు నుండి విసిరిన రూ. 21 లక్షల నగదు బ్యాగ్.. డ్రామా అదిరింది!

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జరిపిన దాడులు సినిమా సీన్‌ను తలపించాయి. మనీలాండరింగ్, భూ కుంభకోణం కేసులో వెస్ట్రన్ టవర్స్ సొసైటీలోని ఒక ఐటీ వ్యాపారి ఇంట్లో సోదాలు చేస్తుండగా, అధికారులు రావడం చూసి 9వ అంతస్తు నుండి రూ. 21 లక్షల నగదు ఉన్న బ్యాగును కిందకు విసిరారు. కింద సిద్ధంగా ఉన్న డ్రైవర్ ఆ బ్యాగుతో పారిపోయేందుకు ప్రయత్నించగా, ఈడీ అధికారులు వెంబడించి పట్టుకున్నారు. ఈ కేసులో పలువురు ప్రముఖ బిల్డర్లు, ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO) చెందిన వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో అక్కడి రాజకీయాల్లో కలకలం రేగుతోంది.

ఈడీ దాడులు.. 9వ అంతస్తు నుండి విసిరిన రూ. 21 లక్షల నగదు బ్యాగ్.. డ్రామా అదిరింది!
cash bag thrown from building

Updated on: May 08, 2026 | 12:55 PM

పంజాబ్‌లో మనీలాండరింగ్, రియల్ ఎస్టేట్ అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఉక్కుపాదం మోపుతోంది. మోహాలీ జిల్లా ఖరార్‌లోని వెస్ట్రన్ టవర్స్ సొసైటీలో ఈడీ అధికారులు జరిపిన దాడులు ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించాయి. ఈడీ అధికారులు ఒక ఐటీ వ్యాపారి నివాసంపై దాడి చేసిన సమయంలో, లోపల ఉన్న వ్యక్తులు ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా, తొమ్మిదో అంతస్తు నుండి సుమారు రూ. 21 లక్షల నగదు ఉన్న బ్యాగును కిందకు విసిరారు. కింద అప్పటికే కారుతో సిద్ధంగా ఉన్న ఒక డ్రైవర్ ఆ బ్యాగును అందుకుని వేగంగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, అప్రమత్తమైన ఈడీ అధికారులు అతనిని వెంబడించి పట్టుకున్నారు. ఆ బ్యాగులో రూ. 21 లక్షల కరెన్సీ నోట్లు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.

ఈ దాడులు కేవలం ఒక్కరికే పరిమితం కాలేదు. మోహాలీ, చండీగఢ్‌లోని సుమారు 12 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సన్‌టెక్ సిటీ ప్రాజెక్ట్, ఏబీఎస్ టౌన్‌షిప్, ఆల్టస్ బిల్డర్స్, ధీర్ కన్స్ట్రక్షన్స్ వంటి పెద్ద సంస్థలు ఈడీ రాడార్‌లో ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి, ప్రజల నుండి వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ కుంభకోణంలో నితిన్ గోహల్ అనే వ్యక్తి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇతను బిల్డర్లకు, ప్రభుత్వ అధికారులకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. నితిన్ గోహల్‌కు పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయంలోని కొందరు ప్రభావవంతమైన వ్యక్తులతో, ముఖ్యంగా సీఎం ఓఎస్డీ రాజ్‌బీర్ ఘుమ్మన్ సన్నిహితులతో సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

వీడియో ఇక్కడ చూడండి..

ప్రస్తుతం ఈడీ అధికారులు డిజిటల్ రికార్డులు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు ఎక్కడి నుండి వచ్చింది? ఎవరికి చేరవేయడానికి ప్రయత్నించారు? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరిన్ని పెద్ద తలకాయల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us