
దుబాయ్ వేగవంతమైన జీవితానికి, కఠినమైన వ్యవస్థలకు ప్రసిద్ధి చెందింది. కానీ, ఇది ప్రతిరోజూ చిన్న చిన్న అద్భుతాలు జరిగే నగరం. ఇటీవల, ఒక భారతీయ కుటుంబానికి ఇలాంటి సంఘటనే ఎదురైంది. అంతేకాదు.. జరిగిన సంఘటనతో అక్కడి సమర్థవంతమైన పోలీస్ వ్యవస్థ, ఆ దేశ నిజాయితీని ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటే.. దుబాయ్లో ఒక మహిళ అనుకోకుండా తన బంగారాన్ని చెత్తబుట్టలో పడవేసుకుంది. కానీ, అదృష్టవశాత్తు, పారిశుధ్య కార్మికులు, పోలీసుల పని తీరుతో ఆమె తన బంగారాన్ని తిరిగి పొందగలిగింది.
కామిని కన్నన్ అనే మహిళ 23 సంవత్సరాలు దుబాయ్లో నివసించిన తరువాత భారత్కు తిరిగి వచ్చారు. అయితే, ఇటీవల ఒక పెళ్లి కోసమని దుబాయ్ వెళ్లారు. జనవరి చివరిలో బంగారం ధరలు విపరీతంగా పెరిగి, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు 600 దిర్హామ్లకు చేరుకున్నప్పుడు, ఆమె తన సంవత్సరాల తరబడి నిల్వ చేసిన బంగారాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలనే కామిని పాత పౌచ్ నుండి బంగారాన్ని తీసి, కొత్త పౌచ్లోకి మార్చుకుని, డైనింగ్ టేబుల్పైనే ఉంచింది. అదే రోజు, ఇంటిని శుభ్రం చేస్తున్న క్రమంలో పౌచ్ అనుకోకుండా చెత్తబుట్టలో పడింది. పౌచ్లో నాలుగు 22 క్యారెట్ల నాణేలు, 50 గ్రాముల 24 క్యారెట్ల బంగారు కడ్డీ ఉన్నాయి. దీని విలువ దాదాపు 50,000 దిర్హామ్లు. (12,30,718.50 Indian Rupee) అంటే భారత కరెన్సీలో దాని విలువ రూ. 12,30,718.50లు.
ఫిబ్రవరి 1న, విమాన ప్రయాణానికి ఒక రోజు ముందు బంగారం పోయిందనే నిజం బయటపడటంతో ఆ కుటుంబం తమ ప్రయత్నాన్ని విరమించుకుంది. వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. కానీ, ఫిబ్రవరి 4న అకస్మాత్తుగా వారు ఉంటున్న భవనం సెక్యూరిటీ గార్డ్ నుండి వారికి ఫోన్ వచ్చింది. చెత్త సేకరించే వ్యక్తికి బంగారం దొరికిందని, అతడు దానిని పోలీసులకు అప్పగించాడని చెప్పారు. ఆ కుటుంబం వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
దుబాయ్ పోలీసులు వేస్ట్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా బంగారాన్ని గుర్తించారు. నైఫ్ పోలీస్ స్టేషన్లో అవసరమైన పత్రాలను సమర్పించిన తర్వాత, బంగారమంతా ఆ కుటుంబానికి తిరిగి ఇచ్చారు. పోలీసులు వారికి ఎంతగానో సహాకరించారు. కష్ట సమయాల్లో ఆశ కోల్పోయిన ఎవరికైనా ఈ దుబాయ్ కథ ఒక పాఠం అవుతుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..