
Amritsar shopkeeper kindness: భారతదేశ సంస్కృతిలో “అతిథి దేవోభవ” అనే మాట ఊరికే రాలేదని పంజాబ్కు చెందిన ఒక సాధారణ దుకాణదారుడు నిరూపించాడు. జేబులో రూపాయి లేకుండా దేశం చుట్టేయాలనే ఒక విదేశీ యాత్రికుడి సాహసానికి, భారతీయుల అపరిమితమైన ప్రేమ, ఆతిథ్యం తోడైతే ఎలా ఉంటుందో చూపించే ఈ మనసుకు హత్తుకునే ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
బ్రిటన్కు చెందిన ఒక ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ హ్యారీ జాగర్డ్ ఒక వినూత్నమైన సోషల్ ఎక్స్పెరిమెంట్ (సామాజిక ప్రయోగం) చేపట్టాడు. భారతదేశంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 24 గంటల పాటు గడపగలనా? అనే సవాల్తో పంజాబ్లోని పవిత్ర నగరమైన అమృత్సర్లో అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న ఒక బట్టల దుకాణంలోకి ప్రవేశించి, తన వద్ద అస్సలు డబ్బులు లేవని అక్కడి వ్యాపారి యుగమ్ లంబాతో చెప్పాడు.
సాధారణంగా ఎవరైనా వ్యాపారి అయితే డబ్బులు లేవని చెప్పగానే ముఖం తిప్పేసుకుంటారు. కానీ, ఇక్కడే అసలైన భారతీయ ఆత్మ ఆవిష్కృతమైంది. ఆ వ్యాపారి ఏమాత్రం కంగారు పడకుండా, మొహంలో చిరునవ్వుతో “నో ప్రాబ్లం బ్రో.. నువ్వు ఉన్నది ఇండియాలో!” అంటూ సాదరంగా ఆహ్వానించాడు. ఈ ఒక్క మాటతో ఆ బ్రిటీష్ పౌరుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.
ఆ దుకాణదారుడు ఆ విదేశీయుడిని ఎంతగానో ఆదరించాడు. “నీకు కాఫీ కావాలా? టీ కావాలా?” అని అడిగి, దుకాణం పైకప్పు (టెర్రస్) పైకి తీసుకెళ్లి వేడివేడి టీ, బిస్కెట్లు అందించాడు. అక్కడ నుంచే స్వర్ణ దేవాలయం (గోల్డెన్ టెంపుల్) పరిసరాల అందాలను చూపిస్తూ ముచ్చటించారు. “భారతదేశంలో నీకు బాగా నచ్చిన అంశం ఏంటి?” అని ఆ టూరిస్ట్ అడగ్గా.. “ఇక్కడ ప్రతి ఒక్కటీ నాకు ఇష్టమే” అంటూ ఆ వ్యాపారి గర్వంగా సమాధానం ఇచ్చాడు.
అంతటితో ఆగకుండా, పంజాబ్ సాంప్రదాయ వంటకమైన నోరూరించే ‘చోలే కుల్చే’ను ఆ టూరిస్ట్కు తినిపించాడు. ఆ రుచికి, వారి ఆప్యాయతకు ముగ్ధుడైన బ్రిటీష్ యాత్రికుడు “భారతీయ ఆతిథ్యం అంటే ఇదే.. నిజంగా అద్భుతం!” అంటూ కెమెరా ముందు మురిసిపోయాడు.
భోజనం తర్వాత ఇద్దరూ కలిసి పంజాబీ పాటలకు స్టెప్పులు వేస్తూ సరదాగా గడిపారు. చివరగా ఆ విదేశీ మిత్రుడు సెలవు తీసుకునే సమయంలో, ఆ దుకాణదారుడు ప్రేమకు ప్రతీకగా ఒక సాంప్రదాయ పంజాబీ స్కార్ఫ్ను (దుపట్టా) అతని మెడలో వేసి వీడ్కోలు పలికాడు. ఈ అపురూప దృశ్యానికి సంబంధించిన వీడియోను యుగమ్ లంబా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకోగా, అది కాస్తా క్షణాల్లో వైరల్గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..