
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ఆరోగ్య సంరక్షణ (Healthcare) విధానాలలో, మందుల ధరలలో ఎంతటి భారీ వ్యత్యాసాలు ఉన్నాయో స్పష్టం చేసే ఒక వార్త ఇప్పుడు గ్లోబల్ మీడియా ప్లాట్ఫారమ్ వేదికగా హాట్ టాపిక్గా మారింది. భారతదేశంలో నివసిస్తున్న ఒక అమెరికన్ మహిళ, అమెరికాలోని అత్యంత ఖరీదైన కార్పొరేట్ వైద్య విధానానికి, భారతదేశంలో సామాన్యులకు అందుబాటులో ఉండే సరసమైన వైద్యానికి మధ్య ఉన్న తేడాను ఎండగట్టింది.
భారతదేశంలో నివసిస్తున్న లిజ్ అనే అమెరికన్ మహిళ ఇన్స్టాగ్రామ్లో ఇండియన్ వర్సెస్ అమెరికన్ హెల్త్కేర్ అనే పేరుతో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె తన అత్తగారి బ్లడ్ క్యాన్సర్ చికిత్సను ఉదాహరణగా తీసుకుంది. ఈ రకమైన రక్త క్యాన్సర్కు వాడే రెవ్లిమిడ్ (Revlimid) అనే బ్రాండెడ్ టాబ్లెట్ ధర అమెరికాలో ఒకదానికి $900 (సుమారు రూ.85,000) గా ఉందని ఆమె పేర్కొంది.
అయితే, ఇదే మందు భారతదేశంలో ఎంత ధరకు లభిస్తుందో తెలుసుకుని ఆమె నోరెళ్లబెట్టింది. ఇండియాలో ఈ మందు జెనరిక్ వెర్షన్ కేవలం రూ.35 నుండి రూ.300 (దాదాపు 30 సెంట్ల నుండి 3 డాలర్లు) లోపే లభిస్తోందని ఆధారాలతో వెల్లడించింది. ఈ భారీ ధరల వ్యత్యాసాన్ని చూపిస్తూ.. అమెరికాలో ఆరోగ్య సంరక్షణ పేరిట సాధారణ ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు (We are being robbed). అదే సమయంలో భారతదేశం మాత్రం తన ప్రజలకు ఎంతో తక్కువ ధరకు, సరసమైన వైద్య సేవలను అందిస్తోంది అని లిజ్ కొనియాడింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే 7.7 లక్షలకు పైగా వీక్షణలను (Views) సొంతం చేసుకుంది. ఈ పోస్ట్పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అమెరికాలోని హెల్త్కేర్ సిస్టమ్, ఇన్సూరెన్స్ కంపెనీల దోపిడీపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది అమెరికా వైద్య రంగంలోని వైఫల్యానికి నిదర్శనం, నియంత్రణ సంస్థలు మారాలి అని కొందరు కామెంట్ చేయగా, భారతదేశంలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగానే క్యాన్సర్ చికిత్స లభిస్తుంది అని భారతీయ నెటిజన్లు గర్వంగా చెప్తున్నారు. విదేశాల నుండి వచ్చే పర్యాటకులు చాలా మంది భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడి జెనరిక్ మందులను కొనుగోలు చేస్తారని, ఇవి యూరప్, అమెరికాల కంటే ఎంతో చౌక, సమానమైన నాణ్యత కలిగి ఉంటాయని పలువురు వైద్యులు సైతం పేర్కొంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..