
అది ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని దుగుధ గ్రామం. ఒక గ్రామస్థుడి ఇంటి వెనుక భాగంలో ఉన్న చిన్న కాలవలో చేపల కోసం వల అమర్చాడు. తెల్లారికల్లా వలలో కొన్ని చేపలు చిక్కుతాయని కదా అనుకున్నాడు. అయితే రాత్రి ఇంటి వెనక నుంచి విచిత్ర శబ్దాలు వినిపించాయి. ఏంటా అని వెళ్లి వల లాగి చూడగా.. అందులో 7 అడుగుల పొడవైన కొండచిలువ చిక్కుకుని ఉంది. అది ఆ వల నుంచి తప్పించుకోలేక విలవిల్లాడటంతో.. వెంటనే స్నేక్ రెస్క్యూ టీంకు సమాచారమిచ్చారు. వెంటనే రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకుని, కొండచిలువకు హాని కలిగించకుండా జాగ్రత్తగా వలలో నుంచి విడిపించారు. తరువాత సిమిలిపాల్ వన్యప్రాణుల అభయారణ్యంలో వదిలిపెట్టారు. పాము ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే దాన్ని వదిలేసినట్లు స్నేక్ క్యాచర్స్ తెలిపారు.
ప్రస్తుతం రెయినీ సీజన్ కావడంతో.. పాములు ఆవాసాలు కోల్పోయి నివాస ప్రాంతాలకు వచ్చే ప్రమాదం ఉందని.. ప్రజలు వాటిని గమినించిన వెంటనే అటవీ అధికారులు లేదా వన్యప్రాణుల కార్యకర్తలకు సమాచారమివ్వాలని కోరుతున్నారు. వాటికి హాని కలిగించవద్దని సూచిస్తున్నారు.
జూన్లో కూడా కోరాపుట్ జిల్లాలోని దశమంతపూర్ బ్లాక్లోని ఒక పాఠశాల ఉపాధ్యాయుడు.. పొలంలో కనిపించిన 12 అడుగుల కొండచిలువను రక్షించాడు. ఆపై దాన్ని సురక్షితంగా అడవిలో వదిలిపెట్టాడు. అయితే అనుభవం లేనివారు పామును పట్టేందుకు ప్రయత్నించవద్దనన్నది స్నేక్ క్యాచర్స్ సజీషన్.