
ప్రపంచ వేలం చరిత్రలో ఒక అపూర్వమైన రికార్డు నమోదైంది. అత్యంత ప్రమాదకరమైన జంతువుగా పేరొందిన టి-రెక్స్ డైనోసార్కు చెందిన సుమారు 6.7 కోట్ల సంవత్సరాల నాటి అస్థిపంజరం భారీ ధరకు అమ్ముడైంది. అమెరికాకు చెందిన సుప్రసిద్ధ వేలం సంస్థ సదబీస్ నిర్వహించిన వేలంలో గస్ అని పిలిచే ఈ అస్థిపంజరం ఏకంగా 50.1 మిలియన్ డాలర్ల (సుమారు 482 కోట్ల రూపాయలు) రికార్డు ధరకు అమ్ముడైంది.
నిజానికి ఈ డైనోసార్ అస్థిపంజరానికి 30 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.288 కోట్లు) వరకు ధర లభించవచ్చని నిర్వాహకులు భావించారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శతకోటీశ్వరుల మధ్య నెలకొన్న పోటీ కారణంగా, వేలం ప్రారంభమైన కేవలం 10 నిమిషాల్లోనే ఒక గుర్తు తెలియని కొనుగోలుదారుడు 50.1 మిలియన్ డాలర్లు చెల్లించి దీన్ని సొంతం చేసుకున్నారు. ఇంత భారీ ధరతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అస్థిపంజరంగా సరికొత్త రికార్డు సృష్టించింది.
గస్ ఒక సాధారణ డైనోసార్ కాదు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మాంసాహార డైనోసార్ అయిన టి-రెక్స్ (టైరన్నోసారస్ రెక్స్) అస్థిపంజరం. అమెరికాలోని సౌత్ డకోటా ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ వ్యవసాయ క్షేత్రం నుండి ఈ అస్థిపంజరాన్ని వెలికితీశారు. శాస్త్రవేత్తల ప్రకారం, ఈ అస్థిపంజరంలో దాదాపు 183 అసలైన ఎముకలు (సుమారు 61 శాతం) ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. మిగిలిన భాగాలను కృత్రిమ ఎముకలతో భర్తీ చేసి, డైనోసార్ తన వేట వెంట పరిగెడుతున్నట్లుగా దీనిని సిద్ధం చేశారు. అయితే, దీని దవడపై ఉన్న రంధ్రాలను మరొక డైనోసార్ కాటు గుర్తులు అని ప్రచారం చేయగా, శాస్త్రవేత్తలు మాత్రం ఇది నోటి ఇన్ఫెక్షన్ లేదా చిగుళ్ల వ్యాధి వల్ల ఏర్పడిన గుర్తులుగా అభివర్ణించారు.
డైనోసార్ వేలం ఇంతటి విజయం సాధించినప్పటికీ, విజ్ఞాన శాస్త్ర రంగానికి ఇది పెద్ద దెబ్బ అని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. పూర్వకాలంలో ఇలాంటి అస్థిపంజరాలు లభిస్తే వాటిని ప్రజల సందర్శన కోసం, పరిశోధనల కోసం ప్రభుత్వ మ్యూజియాల్లో ఉంచేవారు. కానీ, స్థలం యజమానులకు అమ్మే హక్కులు కల్పించినప్పటి నుండి శతకోటీశ్వరులు వీటిని కొని తమ ప్రైవేట్ డ్రాయింగ్ రూమ్లలో అలంకరణగా ఉంచుకుంటున్నారు. జ్ఞాన ప్రపంచానికి ఇది తీరని నష్టం. ఇలాంటి అరుదైన అస్థిపంజరాలు ప్రభుత్వ మ్యూజియంలకు బదులుగా బిలియనీర్ల ప్రైవేట్ డ్రాయింగ్ రూములకు చేరినప్పుడు, సామాన్య ప్రజలకు వీటిని చూసే అవకాశం దూరం కావడమే కాకుండా, భవిష్యత్తులో భూమి పరిణామక్రమంపై పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలకు మార్గాలు మూసుకుపోతున్నాయని నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..