Telangana: పోషకాహార లోపాన్ని నిర్మూలించడమే ప్రభుత్వ ధ్యేయం… స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్…
రాష్ట్రంలో పోషకాహార లోపాన్ని నిర్మూలించడమే ప్రభుత్వ ధ్యేయమని స్ర్తీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సంపూర్ణ ఆరోగ్య...

రాష్ట్రంలో పోషకాహార లోపాన్ని నిర్మూలించడమే ప్రభుత్వ ధ్యేయమని స్ర్తీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా రాష్ట్రంలో మహిళలు, శిశువులలో పోషకాహార లోపాన్ని పూర్తిగా నివారించేందుకు అత్యుత్తమ ప్రణాళిక తయారు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. స్ర్తీలు, శిశువుల్లో పోషకాహార లోపం నివారణకు చేపట్టాల్సిన చర్యలపై గురువారం హైదరాబాద్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ఆరోగ్య లక్ష్మీ, కేసీఆర్ కిట్ వల్ల బాల, బాలికల నిష్పత్తిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. మాతా, శిశు మరణాల రేటు కూడా దేశంలో తెలంగాణలోనే అత్యల్పంగా నమోదైందన్నారు. ఇక పోషకాహార లోపాన్ని నివారించి, ఆరోగ్యకరంగా శిశువులు ఎదగడానికి, మహిళలు ఆరోగ్యంగా ఉండడానికి త్వరలో సమగ్రమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
కొవిడ్ సమయంలో అంగన్వాడీలు చేసిన సేవకు గుర్తింపుగా ఏజన్సీ ప్రాంతమైన భద్రాద్రి –కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, టేకులగూడెం మినీ అంగన్ వాడి కార్యకర్త చంద్రకళకు కేంద్ర ప్రభుత్వ ఉత్తమ అంగన్వాడీ కార్యకర్త అవార్డు లభించిందన్నారు. చంద్రకళకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్ సమయంలో పనిచేసిన అంగన్వాడీలకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో సీఎం కార్యాలయ కార్యదర్శి స్మిత సబర్వాల్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి, కమిషనర్ దివ్య, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి, కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, ఎన్.ఐ.ఎన్ ప్రతినిధులు, మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు పాల్గొన్నారు.