Sathupalli: తుఫాన్ ఎఫెక్ట్.. 13 వేల బాతు పిల్లలు మృత్యువాత.. తట్టుకోలేక ఆగిన గుండె

|

Dec 07, 2023 | 11:48 AM

ఆంధ్రాలోని ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన పెరం ఏడుకొండలు భార్య రమాదేవి, కుమారుడు నాగార్జున, తల్లి ఆదిలక్ష్మి(67)తో కలిసి 2 నెలల క్రితం తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురానికి బాతుల పెంపకం కోసం వచ్చారు. సుమారు 15 వేల బాతు పిల్లలను గ్రామ శివార్లలో మేపుతూ జీవనం సాగిస్తున్నారు.

Sathupalli: తుఫాన్ ఎఫెక్ట్.. 13 వేల బాతు పిల్లలు మృత్యువాత.. తట్టుకోలేక ఆగిన గుండె
Duck (Representative Picture)
Follow us on

మిచాంగ్ తుఫాన్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపింది. చాలా చోట్ల పంట మునిగిపోయి రైతులు నష్టపోయారు. మరికొన్ని చోట్ల మూగజీవాలు మృత్యవాతపడ్డాయి.  తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురంలో కూడా సుమారు 13 వేల బాతు పిల్లలు చలి, వర్షానికి తట్టుకోలేక మృత్యువాత పడ్డాయి. జరిగిన నష్టాన్ని తట్టుకోలేక, తీవ్రంగా బాధపడ్డ వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందింది.

వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రాలోని ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన పెరం ఏడుకొండలు భార్య రమాదేవి, కుమారుడు నాగార్జున, తల్లి ఆదిలక్ష్మి(67)తో కలిసి 2 నెలల క్రితం తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురానికి బాతుల పెంపకం కోసం వచ్చారు. సుమారు 15 వేల బాతు పిల్లలను గ్రామ శివార్లలో మేపుతూ జీవనం సాగిస్తున్నారు. తుఫాన్ కారణంగా అక్కడ మంగళవారం అర్ధరాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కరిసింది. దీంతో రెండు ప్రాంతాల్లో ఉంచిన సుమారు 13 వేల బాతు పిల్లలు మృత్యువాత పడ్డాయి. వాటి విలువ దాదాపు రూ.15 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. చనిపోయిన బాతు పిల్లలను చూసి.. జరిగిన నష్టం గురించి దిగులు చెందుతూ ఆదిలక్ష్మి గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. పశుసంవర్ధకశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి..  బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక తోడ్పాడు అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…