
కొండా సురేఖ వ్యవహారంలో క్లైమాక్స్ ఏంటీ? మంత్రి పదవి నుంచి తొలగించిన తరువాత ఆమె రాజకీయ అడుగులు ఎటువైపు అనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇంతవరకు వచ్చాక కొండా ఫ్యామిలీ సైలెంట్గా ఉంటుందా ? ఒకవేళ కీలక నిర్ణయం తీసుకుంటే.. వారి అడుగులు ఎటువైపు ఉంటాయనే దానిపై పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికర నెలకొంది. ఒకవేళ పార్టీ మారాలని అనుకుంటే.. కొండా సురేఖ ముందు ఉన్న ప్రధాన ఆప్షన్స్ బీఆర్ఎస్, బీజేపీ. అయితే గతంలో బీఆర్ఎస్లోకి చేరి ఎమ్మెల్యేగా గెలిచిన సురేఖ.. 2018 ఎన్నికలకు ముందు ఆ పార్టీ ఎమ్మెల్యే టికెట్ నిరాకరించడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో మరోసారి ఆమె బీఆర్ఎస్ వైపు వెళ్లే అవకాశాలు తక్కువే. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీమంత్రి జగదీష్ రెడ్డి తేల్చేశారు. కొండా సురేఖను బీఆర్ఎస్లోకి రానివ్వబోమని.. ఆమెను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వమని కామెంట్ చేశారు.
ఈ క్రమంలో కొండా సురేఖను తమ పార్టీలోకి తీసుకునే విషయంలో బీజేపీ సానుకూలంగా ఉన్నట్టు ఆ పార్టీ నేతల కామెంట్స్ను బట్టి అర్థమవుతుంది. కొండా సురేఖ బర్తరఫ్ బాధ కలిగిస్తోందని బీజేపీ ఎంపీ డీకే ఆరుణ అన్నారు. ఆమెపై చర్యలు కరెక్ట్ కాదన్నారు. అదేవిధంగా బీసీ మహిళా మంత్రిని బర్తరఫ్ చేయడం ఎంతవరకు సమంజసమని తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్రావు. అయితే బీజేపీలో చేరే విషయమై కొండా దంపతులు తమను సంప్రదించలేదన్నారు. కొండా ఫ్యామిలీ బీజేపీలోకి రావాలంటే పార్టీ హైకమాండ్ను సంప్రదించాల్సి ఉంటుందన్నారు.
ఇదిలా ఉంటే కొండా సురేఖ ఇప్పటికీ కాంగ్రెస్లోనే ఉన్నారని టీపీసీసీ చీఫ్ మహేష్గౌడ్ అన్నారు. అయితే ఇకపై ఆమె ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేయొద్దని కోరారు. పార్టీలో ఎవరు క్రమశిక్షణ తప్పినా.. చర్యలు తప్పవని హెచ్చరించారు. మొత్తానికి ప్రస్తుతం పొలిటికల్ చౌరస్తాలో ఉన్న కొండా ఫ్యామిలీ.. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుంటుందా ? లేక వెయిట్ అండ్ సీ అనే ధోరణితో ముందుకు సాగుతుందా ? అన్న అంశంపై చర్చ జరుగుతోంది.