
సింగరేణి సంస్థ ఆర్థికాభివృద్ధి దిశగా మరో కీలకమైన ముందడుగు పడింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చొరవతో ఎన్నో ఏళ్ల కల అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని PKOC-2 (ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్) డిప్సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కింది. దీనిపట్ల హర్షం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సింగరేణి కార్మికులకు, కార్మికుల కుటుంబ సభ్యులకు, కార్మిక సంఘాల ప్రతినిధులకు, సింగరేణి అధికారులకు తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు.
ఇటీవలే ఒడిశాలోని నైని కోల్ బ్లాక్ , తాడిచర్ల -2 బ్లాక్ సింగరేణి సిగలో చేరిన సందర్భంలో PKOC-2 డిప్ సైడ్ బ్లాక్ ను కూడా సింగరేణికే దక్కేలా చొరవతీసుకోవాలని కార్మికులు, యూనియన్ లీడర్ల నుంచి డిమాండ్లు వచ్చాయి.దీంతో PKOC-2 డిప్సైడ్ బ్లాక్ సింగరేణికి వచ్చే విధంగా అన్నిరకాలుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవడంతో చిరవకు సింగరేణి వశమైంది.
వేలంలో పాల్గొన్న రెండు సంస్థలు
ఈ బ్లాక్ను సొంతం చేసుకునేందుకు ముఖ్యంగా టీజీ జెన్కో, సింగరేణి రెండు సంస్థలు పోటీ పడ్డాయి. అయితే ఈ టీజీ జెన్కో టెండరు ఉపసంహరించుకునేలా ఈ వేలంలో చక్రం తిప్పారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. టెండర్ను వెనక్కి తీసుకునేలా సీఎంపై ఒత్తిడి తీసుకొచ్చి.. జెన్కో టెండరును ఉపసంహించుకునేలా చేశారు. ఇప్పటికే రెండు బ్లాకులు సింగరేణికి రావడంలో కీలకపాత్ర పోషించిన కిషన్ రెడ్డి.. ఇప్పుడు మూడో బ్లాక్ విషయంలోనూ చొరవతీసుకొని మొత్తం మూడు బ్లాకులను సింగరేని వశం చేశారు.
దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థ అయిన సింగరేణి సంస్థకి ఈ డిప్ సైడ్ బ్లాక్ వల్ల సుమారు 180 మిలియన్ టన్నుల బొగ్గు రిజర్వ్స్ అందుబాటులోకి వస్తాయి. సంవత్సరానికి 6 మిలియన్ టన్నుల చొప్పున 25 ఏళ్లపాటు ఈ మైన్ నడుస్తుంది. దాదాపు 2వేల మందికి ఉద్యోగకల్పన జరుగుతుంది.ఇక్కడ దొరికే G-8 (మంచి క్వాలిటీ) బొగ్గు కారణంగా మొత్తం రూ.43వేల కోట్లకు పైగా రెవెన్యూ జనరేట్ అవుతుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10,500 కోట్లకు మించి ఆదాయం కూడా లభిస్తుంది.
దీనివల్ల తెలంగాణ ఇంధన భద్రతకు భరోసా దక్కడంతోపాటుగా.. సింగరేణి భవిష్యత్ అభివృద్ధికి అవసరమైన వనరులు లభిస్తాయి. ప్రభుత్వానికి, సింగరేణికి, విద్యుత్ రంగానికి, ఉద్యోగులకు మేలు జరుగుతుంది. సింగరేణి బొగ్గు కంపెనీకి వరుసగా 3 బొగ్గు బావులు దక్కడం ద్వారా దక్షిణ భారతదేశానికి అవసరమైనంత మేర బొగ్గును అందుబాటులోకి తెచ్చి తెలంగాణ ప్రాంతంలో మరింత పారిశ్రామికాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ కల్పనకు మేలు జరుగుతుంది. సింగరేణి సంస్థకు ఆర్థిక బలం పెరిగి, సింగరేణి కార్మికులకు ఉద్యోగ భద్రత మరింతగా పెరుగుతుంది.
మూడు కోల్ బ్లాక్స్ తో భారీగా సమకూరనున్న ఆదాయం
నైని, తాడిచర్ల-2, PKOC-2 డిప్సైడ్ బ్లాక్ రావడంతో సింగరేణికి మొత్తం 860 మిలియన్ టన్నుల రిజర్వ్స్ సమకూరుతాయి. అంతేకాదు 6,500 మందికి జీవనోపాధి లభిస్తుంది. సగటున 35 ఏళ్లపాటు ఏడాదికి 22 మిలియన్ టన్నుల చొప్పున బొగ్గు ఉత్పత్తి చేయవచ్చు. ఈ 3 బ్లాక్స్ వల్ల సింగరేణికి రూ.1,95,510 కోట్లకు పైగా రెవెన్యూ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా రూ.48వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.