ఎంఐఎంపై భయమా? ప్రేమా? : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కిషన్ రెడ్డి

భూ వ్యవహారాలు, చెరువుల పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సామాన్య ప్రజలపై వేగంగా చర్యలు తీసుకుంటూ, ఎంఐఎంకు సంబంధించిన అంశాల్లో మాత్రం అదే చొరవ చూపడం లేదని విమర్శించారు. చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎంఐఎంపై భయమా? ప్రేమా? : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కిషన్ రెడ్డి
Kishan Reddy

Updated on: Jul 05, 2026 | 3:32 PM

భూ వ్యవహారాలు, చెరువుల పరిరక్షణ విషయంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రకాల వైఖరితో వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సామాన్య ప్రజల విషయంలో హైడ్రా వేగంగా చర్యలు తీసుకుంటున్నా.. ఎంఐఎంకు సంబంధించిన అంశాల్లో మాత్రం అదే వేగం కనిపించడం లేదని విమర్శించారు.

సల్కం చెరువు పూర్తి నీటి మట్టం (FTL), బఫర్ జోన్‌లో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బారిస్టర్ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ వ్యవహారాన్ని ప్రస్తావించిన ఆయన.. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు పలుమార్లు ప్రశ్నలు లేవనెత్తి.. హైడ్రా, విద్యాశాఖ సహా సంబంధిత శాఖల నుంచి వివరణలు కోరినా ప్రభుత్వం ఇప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎంను మొత్తం ముస్లిం సమాజానికి ప్రతినిధిగా భావిస్తున్నట్లు వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. హైడ్రా చర్యల వల్ల పేద ముస్లింలు కూడా నష్టపోయినా.. వారి ఇళ్లు కూల్చివేసినప్పుడు గానీ, జీవనాధారాలు దెబ్బతిన్నప్పుడు గానీ కాంగ్రెస్, ఎంఐఎం పెద్దగా స్పందించలేదని అన్నారు. కానీ ఎంఐఎంకు సంబంధించిన సంస్థల విషయంలో మాత్రం రెండు పార్టీలు ఒకే విధంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

ఫాతిమా విద్యాసంస్థల వ్యవహారం కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను, ఎంఐఎం ద్వంద్వ వైఖరిని బయటపెట్టిందని కిషన్ రెడ్డి అన్నారు. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఒక వర్గం మొత్తానికి ఏకైక ప్రతినిధిగా చెప్పుకోలేదని స్పష్టం చేశారు. పేదల విషయంలో బుల్డోజర్లు, రాజకీయ మిత్రుల విషయంలో రక్షణ అనే భావన ప్రజల్లో కలగకుండా ప్రభుత్వం వ్యవహరించాలని సూచించారు.

ప్రజా భూములు, చెరువులు, ప్రభుత్వ ఆస్తులు తెలంగాణ ప్రజలవేనని, వాటి పరిరక్షణలో ఎలాంటి పక్షపాతం ఉండకూడదని కిషన్ రెడ్డి అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొందరిపై మాత్రమే చర్యలు తీసుకుని, మరికొందరి విషయంలో మౌనం పాటిస్తే ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని, తెలంగాణ ప్రజలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Follow Us