మాయమవుతున్న వృక్షం.. అడిగేవాళ్లు లేరనా.. నరికినా ఎవరూ పట్టించుకోరనా..?

పచ్చని చెట్టు ప్రగతి మెట్టు, కానీ అదేంటి పచ్చని చెట్టు రోడ్డుకు అడ్డు.. అందుకే నరుకు.. అన్నట్టుగా చకా చకా నరికేసుకుంటూ పోతున్నారు. అడిగేవాళ్లు లేరనా.. నరికినా ఎవరూ పట్టించుకోరనా..? ఒక మొక్క చెట్టవ్వాలంటే ఏళ్లు పడుతుంది. కానీ ఇక్కడ చిటికేసినంత టైములో చెట్టంత చెట్టును అడ్డంగా నరికేస్తున్నారు. ఎందుకిలా అంటే అంతా మన అభివృద్ధి కోసమే అంటున్నారు అధికారులు. అభివృద్ధి అంటే విధ్వంసమా..? మనం డెవలప్‌ కావాలంటే చెట్టును నరకడమే ప్రత్యామ్నాయమా ? అసలు NH44 కర్నూల్ రోడ్డులో ఏం జరుగుతోంది..?

మాయమవుతున్న వృక్షం.. అడిగేవాళ్లు లేరనా.. నరికినా ఎవరూ పట్టించుకోరనా..?
Trees Felling

Edited By: Balaraju Goud

Updated on: Aug 29, 2025 | 6:11 AM

మానవాళి మనుగడకు చెట్లు చాలా ముఖ్యం..హైదరాబాద్ మహానగరం కాంక్రీట్ జంగల్‌గా మారిపోయింది..హైదరాబాద్ శివారు ప్రాంతంలో కూడా అభివృద్ధి చెందడంతో అక్కడ కూడా పచ్చని చెట్లు కనుమరుగవుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో అభివృద్ధి, రోడ్ల విస్తరణ పేరుతో చెట్లు నరికేస్తున్నారు..ఇప్పుడు ఇక్కడా అదే జరుగుతోంది.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ NH44 కర్నూల్ రోడ్డు నుంచి పెద్ద గోల్కొండ సెంటర్ వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. అందుకే రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగిస్తున్నారు..

ఇప్పటికే నగరం కాలుష్యకారకాలతో నరకంగా మారింది. కనీసం శివారు ప్రాంతాలైనా చెట్లతో మంచి ఆరోగ్య వాతావరణంతో కనిపిస్తుండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు స్థానికులు. అభివృద్ధి పేరుతో ఇష్టారీతిన ప్రకృతి విధ్వంసం జరుగుతోందని, రోజూ ఈదారిన వెళ్తుంటే.. ఆ చెట్లు ఎంతో ఆహ్లాదకరంగా కనిపించేవని, చల్లటి గాలిని ఇస్తూ ఆరోగ్యానికి రక్షణ కవచంలా ఉన్న ఈచెట్లు కనుమరుగైపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ఇంత హడావుడిగా ఎందుకు నరికేస్తున్నారంటే.. NH 44 కర్నూల్ రోడ్డు నుంచి పెద్ద గోల్కొండ సెంటర్ ఏడు కిలోమీటర్ల వరకు రోడ్డు విస్తరణ ఉంది. 40 అడుగుల ఉన్న రోడ్డును 100 అడుగుల రోడ్డుగా మారుస్తున్నారు..అందుకే ఈనరికివేత. ఓకే అభివృద్ధి ముఖ్యమే కానీ, చెట్లను కాపాడడం అంతకుమించి ముఖ్యం.. వేసవికాలం, వర్షాకాలంలో చెట్లు మనిషికి ఎంత ఉపయోగపడతాయో అందరికి తెలుసు. అలాంటి చెట్టును నరికితే భవిష్యత్ ఎంత భయంకరంగా ఉంటుందో కూడా తెలుసు. అయినా సరే అధికారులు చాలా ఈజీగా నరికేసుకుంటూ పోతున్నారు. చెట్టును తొలగించడం తప్పనిసరైతే..నరకడం కంటే లేటెస్ట్ టెక్నాలజీతో మరోచోట వాటిని తరలించి బతికించొచ్చు కదా అన్నది.

నరుకుతున్న చెట్లు ఇప్పటివి కావు. పాతిక ముప్పైఏళ్ల వయసున్నవి. ఇలాంటి చెట్లు పెంచాలంటే మరో పాతికేళ్లు ఆగాలి. కానీ వాటిని చిటికెలో నరికేస్తోంది మన అధికార గణం. చెట్లను నరికేందుకు R&B డిపార్ట్‌మెంట్, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించింది. అక్కడి నుంచి పర్మిషన్ కూడా ఇచ్చారని చెబుతున్నారు అధికారులు.

అటవీశాఖ రెండు వైపులా పరిశీలించి ట్రీ ప్రొటెక్షన్ కమిటీకి సిఫార్సు చేశామని. ట్రీ ప్రక్షన్ కమిటీ ఇన్స్పెక్షన్ చేసి ట్రాన్స్ లొకేషన్ ద్వారా చెట్టుని వేరేచోట నాటడం, రిటెన్షన్ అంటే చెట్టును ఎక్కడ ఉందో అక్కడే ఉంచడం, ట్రీ ఫెల్లింగ్ అంటే చెట్టుని పూర్తిగా తొలగించడం లాంటి వాటికి అనుమతులు కూడా ఇచ్చింది. అయితే కొన్నింటిని ఒకచోటు నుంచి వేరే చోటకి తరలించినా బతకవనీ, అన్నిరకాలుగా చెక్ చేశాకే వీటిని తొలగిస్తున్నామంటోంది అటవీశాఖ

అధికారులు అంతా ప్రాపర్‌గానే చేస్తున్నట్టు కనిపిస్తున్నా.. ఇక్కడ చూస్తే మొత్తం తొలగిస్తున్నారు తప్ప, ట్రాన్స్ లొకేషన్ లాంటి చర్యలు అధికారులు తీసుకోవడంలేదంటున్నారు స్థానికులు. ఎంతో ఏపుగా పెరిగిన చెట్లను మరోచోటకు తరలించకుండా ఇష్టారీతిన తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి పేరుతో పృకృతి విధ్వంసం చేస్తే భవిష్యత్ అంతా భయంకరంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..