Telangana: అక్కడ జీలుగు కల్లుకు యమ డిమాండ్.. ఏకంగా సీసా రూ.500.. ముందు బుక్ చేసుకుంటేనే

|

Jan 22, 2022 | 3:40 PM

తెలుగునాట తాటి కల్లు, ఈత కల్లు కామన్. ఇంకా అక్కడక్కడా వేప కల్లు , చింత కల్లు పేర్లే ఇప్పటివరకు విన్నాం.. కానీ, ఇప్పుడు తెలంగాణ ఆ ప్రాంతంలో జీలుగు కల్లు ఫేమస్ అయ్యింది.

Telangana: అక్కడ జీలుగు కల్లుకు యమ డిమాండ్.. ఏకంగా సీసా రూ.500.. ముందు బుక్ చేసుకుంటేనే
Toddy
Follow us on

Toddy: తెలుగునాట తాటి కల్లు, ఈత కల్లు కామన్. ఇంకా అక్కడక్కడా వేప కల్లు , చింత కల్లు పేర్లే ఇప్పటివరకు విన్నాం.. కానీ, ఇప్పుడు తెలంగాణ ఆ ప్రాంతంలో జీలుగు కల్లు ఫేమస్ అయ్యింది. కల్లు ప్రియులు పోటీ పడి మరీ లొట్టలు వేసుకుంటూ అక్కడికి క్యూ కడుతున్నారు. ఏకంగా ముందస్తు బుకింగ్ చేసుకోవడమే కాకుండా సీసా 500 రూపాయలకు సైతం కొనేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇంత డిమాండ్ ఎందుకంటే జీలుగు కల్లు తాగితే కిడ్నీ రాళ్ళ సమస్యతో పాటు షుగర్, బీపీ లాంటి సమస్యలు కూడా దరి చేరవని అక్కడి ప్రజల నమ్మకం.

సూర్యాపేట మండలం కాసరాబాద గ్రామంలో జీలుగు చెట్టు కల్లు కోసం జనం క్యూ కడుతున్నారు. తాటి కల్లు, ఈత కల్లు కంటే కూడా ఈ జీలుగు కల్లు రుచిగా ఉండటంతో జనం జీలుగు కల్లు కోసం ఎగబడుతున్నారు. ముందుగా కల్లు కోసం అడ్వాన్స్ కట్టి మరీ బుకింగ్ చేసుకుంటున్నారు. గ్రామంలో జీలుగు కల్లుకి డిమాండ్ పెరగడంతో తాటి, ఈత కల్లు కోసం ఎవరూ రావడంలేదంటున్నారు గీతన్నలు. గౌడ కులస్తులకు జీలుగు వనాలు పెంచుకునే ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలని కోరుతున్నారు స్థానిక కల్లు గీత కార్మికులు .

సూర్యాపేట మండలం కాసరబాద గ్రామానికి చెందిన కోల్లు సైదులు గౌడ్ గత పదిహేనుళ్ల క్రితం ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి కల్లు గీయడానికి వెళ్ళాడు. అక్కడ జీలుగు కల్లు వాడుకలో ఉండటంతో సైదులు జీలుగు చెట్లకు కల్లు గీయడం నేర్చుకుని అక్కడి నుండి జీలుగు విత్తనాలు తీసుకొచ్చి గ్రామంలో నాటాడు. నాటిన చెట్లలో కొన్ని మాత్రమే నాటుకోగా గత మూడేళ్లుగా ఒక చెట్టు కల్లు రావడం మొదలుపెట్టింది. మొదట్లో కేవలం తన ఇంటికి సరిపడే కల్లు మాత్రమే వచ్చిందని, ఈ యేడు ఒక్క చెట్టు నుండే 50 సీసాలకు పైగా కల్లు దిగుబడి వస్తుందని సైదులు చెబుతున్నాడు.

అయితే సాధారణ కల్లు కంటే జీలుగు కల్లు రుచిగా ఉండటంతో జనం జీలుగు కల్లు కోసం సైదులు వద్దకు క్యూ కడుతున్నారు. జీలుగు కల్లు తాగితే షుగర్, కిడ్నీలో రాళ్ళు రావన్న నమ్మకంతో… దాని కోసం ఆర్డర్లు పెడుతున్నారని చెబుతున్నాడు. కాసారబాద గ్రామం నుండే కాకుండా సూర్యాపేట చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా జనం తరలివస్తున్నారు. ధర ఎంతైనా సరే చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు. జీలుగు కల్లు రుచి చూసిన వాళ్ళు తమ దగ్గర దొరికే తాటి, ఈత కల్లు కోసం రావడం తగ్గించారని కల్లు గీత కార్మికులు చెబుతున్నారు. జీలుగు కల్లు దెబ్బకి తమ గిరాకీ దెబ్బతింటుందని చెబుతున్నారు. జిలుగు కల్లు కి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తమకు కూడా జీలుగు విత్తనాలు ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహించాలని స్థానిక గీత కార్మికులు కోరుతున్నారు.

Also Read: Hyderabad: విడాకుల కోసం వచ్చిన మహిళను ట్రాప్ చేసిన లాయర్.. వీడియోలు తీసి.. శారీరకంగా