‘ఈటల నన్ను చంపించబోయారు.. బాల్‌రాజ్‌ను 2014లో హత్య చేయించారు.. ఆయనకు నరనరానా ఓసీ ఫీలింగ్ ఉంది’ : పాడి కౌశిక్ రెడ్డి

|

Jul 20, 2021 | 2:54 PM

"ఈటెల రాజేందర్ హత్యా రాజకీయాలు చేస్తారు.. మాజీ ఎంపీటీసీ బాల్ రాజ్‌ను 2014 లో ఈటెల హత్య చేయించారు."..

ఈటల నన్ను చంపించబోయారు.. బాల్‌రాజ్‌ను 2014లో హత్య చేయించారు.. ఆయనకు నరనరానా ఓసీ ఫీలింగ్ ఉంది :  పాడి కౌశిక్ రెడ్డి
Padi Koushik Reddy
Follow us on

Padi Koushik Reddy – Etela Rajender : ఈటల రాజేందర్ నన్ను హత్య చేయించే ప్రయత్నం చేశారు.. నేను మాత్రం ఆయన నిండు నూరేళ్లూ బ్రతకాలని కోరుకుంటున్నానని చెప్పారు పీసీసీ మాజీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి. ఈటల.. తాను బీసీ వర్గానికి చెందిన వాడినని పైకి చెబుతున్నప్పటికీ ఆయనకు నరనరానా ఓసీ ఫీలింగ్ ఉందని పాడి చెప్పుకొచ్చారు. తాను రేపు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని కౌశిక్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించి హుజురాబాద్ కు సంబంధించి అనేక విషయాలపై మాట్లాడారు. “ఈటల రాజేందర్‌కు 18 ఏళ్ళు అవకాశం ఇచ్చారు.. వచ్చే రెండేళ్ల కోసం టీఆర్ఎస్ పార్టీకి హుజురాబాద్‌లో ఒక్క అవకాశం ఇవ్వండి” అని పాడి నియోజకవర్గ ప్రజల్ని ఈ సందర్భంగా అభ్యర్థించారు.

వచ్చే ఈ రెండేళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పిన పాడి.. ఈటల రాజేందర్ వ్యక్తిగత ప్రయోజనం కోసం హుజురాబాద్ ప్రజలు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. ప్రతి బీసీ కుటుంబం కోసం తాను కేసీఆర్‌తో మాట్లాడి అభివృద్ధి చేస్తానని కౌశిక్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. హుజురాబాద్ ఎమ్మెల్యే తరహాలో నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తున్నారని పాడి తెలిపారు.

ఈటల ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు.. ఆయనకు ఎవ్వరూ నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదు అయినా కాని.. సీఎం కేసీఆర్ నిధులివ్వలేదని ఇప్పుడు ఆరోపించడం ఎంతవరకూ సబబని ఆయన నిలదీశారు. తాను బాధ్యతగల వ్యక్తిగా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతానని చెప్పిన పాడి.. తానెప్పుడూ ఈటల – టీఆరెస్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదని గుర్తుచేసుకున్నారు. “ఈటల రాజేందర్ హత్యా రాజకీయాలు చేస్తారు.. మాజీ ఎంపీటీసీ బాల్ రాజ్‌ను 2014 లో ఈటెల హత్య చేయించారు.” అని ఈటలపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు పాడి కౌశిక్ రెడ్డి.

Read also :  Sanchaita : ‘అశోక్ బాబాయ్ గారూ.. ఆ చర్యలకు మీరు సిగ్గుపడడంలేదా?’ : సంచయిత