తెలంగాణలో మారుతున్న వాతావరణం.. మూడు రోజుల పాటు వర్షాలు, ఈదురుగాలులు..

Telangana Weather: తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. కొన్ని ఉత్తర, తూర్పు జిల్లాల్లో వడగాల్పులు కూడా వీచే అవకాశముందని హెచ్చరించింది.

తెలంగాణలో మారుతున్న వాతావరణం.. మూడు రోజుల పాటు వర్షాలు, ఈదురుగాలులు..
Telangana Weather

Updated on: May 24, 2026 | 4:28 PM

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. ఒకవైపు ఎండలు కొనసాగుతుండగా.. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుకుగా ముందుకు సాగుతున్నాయి. దీంతో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి.. ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల వైపు మరింత ముందుకు సాగే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

ఇక మరోవైపు దక్షిణ బీహార్ పరిసర ప్రాంతాల నుంచి జార్ఖండ్, ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో తెలంగాణలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు.

మూడు రోజుల వాతావరణ సూచన

ఆదివారం, సోమవారం, మంగళవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా సాయంత్రం మరియు రాత్రి వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. అదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. వర్షాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా ఉష్ణోగ్రతలు తగ్గినా.. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం ఇంచుమించు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగే అవకాశముందని పేర్కొంది.

కొన్ని జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక

వర్షాల సూచనలు ఉన్నప్పటికీ.. రాష్ట్రంలోని కొన్ని ఉత్తర, తూర్పు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడకూడదు. ఈదురుగాలుల సమయంలో అవసరం లేకపోతే బయటకు వెళ్లకుండా ఉండాలి. మధ్యాహ్నం వేళల్లో అధిక ఎండలో ఎక్కువసేపు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తగినంత నీరు తాగుతూ శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలి. రాబోయే రోజుల్లో నైరుతి రుతుపవనాల పురోగతితో తెలంగాణలో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us