
పెళ్లి అంటే పూల పందిరి, పట్టుచీరలు, తలంబ్రాలు, వందల మంది అతిథులు ఉంటారు. కానీ ఓ దగ్గర జరిగిన పెళ్లికి కేవలం ఆత్మీయత మాత్రమే తోడు అయ్యింది. ఇక్కడ జరిగిన పెళ్లికి మంగళసూత్రాలు లేవు.. బాజాభజంత్రీలు లేవు.. చుట్టు ఉన్న అడవిలో దొరికిన రంగురంగుల పూలనే పూల దండలుగా మార్చారు. పచ్చటి ఆకులనే అక్షింతలుగా, ఒడిబియ్యంగా ఉపయోగించారు.
కష్టాల సాగులో కాసేపు ఆటవిడుపు.. ఎండనక, వాననక రెక్కాడితే గాని డొక్కాడని ఆ కూలీల జీవితాల్లో ఒక్కసారిగా పెళ్లి బాజాలు మోగాయి..అవును.. ఏదో కళ్యాణ మండపంలో జరిగినవి కావు.. ఉపాధిహామీ పని స్థలమే ఆ వేడుకకు వేదికైంది. తోటి కూలీల ఆత్మీయతే ఆ బంధాన్ని మరింత గట్టి చేసింది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నత్నాయపల్లి గ్రామంలో జరిగిన ఈ వినూత్న వేడుక ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
వివరాల్లోకి వెళ్తే.. నత్నాయపల్లి గ్రామానికి చెందిన దంపతులకు ప్రతిరోజూ లాగే ఉపాధిహామీ పనికి వెళ్లారు. ఉదయం నుంచి ఎండలో కష్టపడిన కూలీలకు మధ్యాహ్నం కాసేపు విరామం దొరికింది.ఆ విరామ సమయాన్ని వృధా చేయకూడదనుకున్నారు తోటి కూలీలు. అలసటను మరిచిపోయేందుకు ఒక సరదా ఆటవిడుపుకు తెరతీశారు. పనికి వచ్చిన ఆ దంపతులకు అక్కడికక్కడే మళ్లీ పెళ్లి చేయాలని నిశ్చయించారు. ప్రకృతి ఒడిలోనే సాంప్రదాయ పద్ధతిలో ఆ దంపతులకు మళ్లీ కల్యాణం జరిపించి మురిసిపోయారు తోటి శ్రామికులు.
ఎండ తీవ్రతకు నీరసించిపోయే వేళ.. ఈ చిరునవ్వుల వేడుక కూలీల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నిత్యం కష్టాలతో సాగే తమ జీవితాల్లో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే పెద్ద ఉపశమనమని వారు చెబుతున్నారు. నత్నాయపల్లి ఉపాధిహామీ పనిస్థలంలో జరిగిన ఈ సరదా పెళ్లి వేడుక ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..