CM KCR Extends Greetings: సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యం.. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

|

Jun 01, 2021 | 9:41 PM

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్ఎస్ సర్కార్ పథకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు.

CM KCR Extends Greetings: సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యం.. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
Cm Kcr Extends Greetings Of Telangana State Formation Day
Follow us on

CM KCR Extends Greetings of Telangana State Formation Day: తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్ఎస్ సర్కార్ పథకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం, రోడ్లు, తదితర మౌలిక వసతులను., స్వల్పకాలిక, ధీర్ఘకాలిక లక్ష్యాలతో కల్పన చేసుకుంటూ వస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎనిమిదవ అవతరణ దినోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక పోరాటాలు, త్యాగాలు బలిదానాలతో పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్దతిలో పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో దేశం గర్వించదగ్గ రీతిలో నిలబెట్టుకున్నామన్నారు. ఏడేండ్ల అనతి కాలంలోనే ధృఢమైన పునాదులతో సుస్థిరతను చేకూర్చుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.

భారత దేశంలో 29 రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ.. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికి, సహచర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే స్థాయిలో నిలబెట్టుకున్నందుకు తనకు గర్వంగా ఉందని సీఎం తెలిపారు. సమైక్య రాష్ట్రంలో విస్మరించబడిన రంగాలను, ఒక్కొక్కటిగా ఓపికతో, దార్శనికతతో అవాంతరాలను అధిగమిస్తూ సక్కదిద్దుకుంటూ వస్తున్నామని సీఎం అన్నారు. తెలంగాణ సమాజం.. తొంభైశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో నిండివున్న నేపథ్యంలో.. వారి అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.

ప్రజా ఆకాంక్షలను కార్యాచరణలో పెట్టాలనే చిత్తశుద్ది, ధృఢ సంకల్పం, తెలంగాణ పట్ల నిబద్ధత, అన్నిటికీ మించి.. అమరుల త్యాగాలకు అభివృద్ధి ద్వారా ఘన నివాళిని అర్పించాలనే స్పూర్తి వున్నదన్నారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు, కళాకారులు, కులవృత్తులు, ఇతర వృత్తులతో పాటు, ఆసరా అందాల్సిన ప్రతి ఒక్క వర్గానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలబడిందన్నారు. ఆర్థికంగా, సామాజికంగా సబ్బండ వర్గాల ఆత్మగౌరవాన్ని ఎత్తిపడుతూ తెలంగాణను సాధించుకున్న ఫలితాలను వారికి అందిస్తూ, వారి ఆనందంలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామిగా మారిందన్నారు.

తెలంగాణ రైతును కాపాడి, వ్యవసాయాన్ని పునరుజ్జీవింప చేయడమే కాకుండా ఏడేండ్ల అనతికాలంలోనే తెలంగాణను భారతదేశానికే అన్నపూర్ణగా నిలపడం వెనక తెలంగాణ ప్రభుత్వం అకుంఠిత ధీక్ష ఇమిడివున్నదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి తెలంగాణ వ్యవసాయాన్ని స్థిరీకరించి, తెలంగాణ గ్రామీణ వ్యవస్థను ఆర్ధికంగా పరిపుష్టం చేయడంలో తెలంగాణ ప్రభుత్వం సఫలీకృతమైందన్నారు. ఈ ఘన విజయంలో తెలంగాణ ప్రజల సహకారం మహా గొప్పదని, తెలంగాణ పోరాటంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

కరోనా ఉపద్రవం వలన రాష్ట్ర ఖజానాకు కొంత ఇబ్బంది కలిగినా ప్రజల సహకారంతో ఎప్పటికప్పుడు నిలదొక్కుకుంటూ ముందుకు పోతున్నామని సీఎం అన్నారు. ప్రజలు తనమీద నిలిపిన విశ్వాసం, అభిమానమే తనకు కొండంత ధైర్యమన్నారు. ప్రజలిచ్చిన భరోసాతో తెలంగాణను బంగారి తెలంగాణగా తీర్చిదిద్దుకునే వరకు తాను విశ్రమించనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Read Also…  Private Hospitals License : రూల్స్ బ్రేక్ చేసిన ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ సర్కార్ కొరడా.. మరో 6 ఆసుపత్రుల లైసెన్సు రద్దు..!