TSRTC: ఇది సరికాదు.. ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై సజ్జనార్‌ వార్నింగ్‌.

కొందరు అవసరం లేకపోయినా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని, పురుషులకు సీట్లు సరిపోవడం లేదని ఇలా రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ ఘటనపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఫుట్‌బోర్డ్‌ ప్రయాణం చేస్తున్నారని బస్సు ఆపించిన ఓ మహిళా కండక్టర్‌పై కొందరు ప్రయాణికులు దూషించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సదరు మహిళా కండక్టర్‌ కంటతడి పెట్టడంతో...

TSRTC: ఇది సరికాదు.. ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై సజ్జనార్‌ వార్నింగ్‌.
Sajjanar

Updated on: Dec 28, 2023 | 8:54 PM

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. మహాలక్ష్మీ పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకానికి మహిళల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. బస్సుల్లో విపరీతంగా రద్దీ పెరుగుతోంది. అయితే ఇప్పుడీ ఉచిత బస్సు ప్రయాణ పథకం పలు వివాదాలకు దారితీస్తోంది.

కొందరు అవసరం లేకపోయినా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని, పురుషులకు సీట్లు సరిపోవడం లేదని ఇలా రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ ఘటనపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఫుట్‌బోర్డ్‌ ప్రయాణం చేస్తున్నారని బస్సు ఆపించిన ఓ మహిళా కండక్టర్‌పై కొందరు ప్రయాణికులు దూషించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సదరు మహిళా కండక్టర్‌ కంటతడి పెట్టడంతో అన్ని వార్తా పత్రికల్లో ఈ వార్తను ప్రచురించారు. దీంతో ఈ విషయం కాస్త ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌ దృష్టికి చేరింది. దీంతో ఈ ఘటనపై సజ్జనర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.

మహిళా కండక్టర్‌ కంటతడి పెట్టిన వార్తా పత్రికల క్లిప్పింగ్స్‌ను షేర్‌ చేసిన సజ్జనర్‌.. ‘ఆర్టీసీకి సిబ్బంది వెన్నుముక. వారు అనునిత్యం నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సిబ్బంది కృషి వల్లనే సంస్థ మనగలుగుతుంది. మహాలక్ష్మి స్కీమ్‌ అమలులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లైనా సిబ్బందిని కొందరు దూషించడం, దాడులు చేయడం సరికాదు. ఇలాంటి ఘటనలకు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించద’ని రాసుకొచ్చారు.

సజ్జనర్ ట్వీట్‌..

అలాగే.. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్న సజ్జనర్‌.. ఇప్పటికే తమ అధికారులు ఈ ఘటనలపై స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారన్నారు. పోలీసులు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి.. విచారణ చేపట్టారని, ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ సిబ్బందికి సహకరించి.. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సహకరించాలని సజ్జనర్ రాసుకొచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..