Telangana: దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..

దేశంలో విద్యుత్ వినియోగ వృద్ధి రేటులో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. గృహ, పారిశ్రామిక రంగాలు వేగంగా విస్తరిస్తుండటం.. దీనికి తోడు వ్యవసాయ రంగానికి డిమాండ్ భారీగా పెరగడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో 20.5 శాతం విద్యుత్ వినియోగ వృద్ధి నమోదైంది. మొత్తం 8,953 మిలియన్ యూనిట్ల వినియోగంతో జాతీయ స్థాయిలో తెలంగాణ మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

Telangana: దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో  తెలంగాణ సరికొత్త రికార్డ్..
Telangana Power Consumption Growth

Updated on: Jun 11, 2026 | 8:00 AM

తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా దూసుకుపోతోందనడానికి నిదర్శనంగా మరో అరుదైన రికార్డు నమోదైంది. దేశంలోనే విద్యుత్ వినియోగ వృద్ధి రేటులో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్ నెల గణాంకాల ప్రకారం.. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో కరెంట్ వినియోగం ఏకంగా 20.5 శాతం వృద్ధిని నమోదు చేసి దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. ఈ జాబితాలో బిహార్ రెండో స్థానంలో నిలవగా, కర్ణాటక మూడో స్థానాన్ని, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాయి.

రికార్డు స్థాయికి చేరిన డిమాండ్

రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరగడం, ఐటీ రంగా విస్తరణ, పారిశ్రామికాభివృద్ధి కారణంగా కరెంట్ డిమాండ్ మునుపెన్నడూ లేని విధంగా పెరిగింది. ఏప్రిల్ నెలలో మొత్తం విద్యుత్ వినియోగం ఏకంగా 8,953 మిలియన్ యూనిట్లకు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గృహ, పారిశ్రామిక అవసరాలతో పాటు వ్యవసాయ రంగానికి డిమాండ్ భారీగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం.

1.40 కోట్లు దాటిన గృహ కనెక్షన్లు

రాష్ట్రంలో మౌలిక వసతులు, గృహ నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తుండటంతో గృహ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య సరికొత్త మైలురాయిని దాటింది. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం గృహ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 1.40 కోట్లు దాటింది. గత ఒక్క ఏడాదిలోనే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 3.11 లక్షల గృహ కనెక్షన్లు పెరగడం గమనార్హం.

అన్నదాతకు అండగా..

తెలంగాణలో వ్యవసాయ రంగానికి కరెంట్ సరఫరా అత్యంత కీలకంగా మారింది. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగడంతో బావుల కింద, బోర్ల కింద నడిచే మోటార్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ బోర్లకు ఉన్న మొత్తం విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 30.36 లక్షలకు చేరింది. గత ఏడాది కాలంలోనే అదనంగా 1.08 లక్షల కొత్త వ్యవసాయ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్‌లో సింహభాగం, అంటే దాదాపు 40 శాతం విద్యుత్‌ను కేవలం వ్యవసాయ రంగానికే ఉచితంగా పంపిణీ చేస్తుండటం విశేషం. దేశంలోనే అత్యధిక వ్యవసాయ బోర్ల కనెక్షన్లు కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.

క్యూలో మరో లక్ష మంది రైతులు..

రాష్ట్రంలో వ్యవసాయానికి డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇప్పటికే 30 లక్షలకు పైగా కనెక్షన్లు ఉండగా, కొత్తగా కరెంట్ కనెక్షన్ల కోసం మరో లక్ష మంది రైతుల నుంచి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సాగునీటి లభ్యత పెరగడం, కొత్త భూములు సాగులోకి రావడంతో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Follow Us