Telangana: గ్రామ కంఠం భూములంటేనే ఎన్నో వివాదాలు.. సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ సర్కార్ కసరత్తు
Telangana: తెలంగాణలో గ్రామ కంఠం భూములకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామ కంఠంలోని భూములను గుర్తించి, వాటికి చట్టబద్దత..
Telangana: తెలంగాణలో గ్రామ కంఠం భూములకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామ కంఠంలోని భూములను గుర్తించి, వాటికి చట్టబద్దత కల్పించడమే కాకుండా క్రయ విక్రయాలకు వీలు కలిగే విధంగా రికార్డులు కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాజేంద్ర నగర్ TS IRDలో ఈ విషయమై డీపీఓలు, ఎంపీడీవోలు ఇతర అధికారులు, సర్పంచ్లతో మంత్రి ఎర్రబెల్లి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమలు చేస్తున్నామని, పల్లె ప్రగతి వంటి పథకంతో గ్రామాల రూపు రేఖలు మారుతాయన్నారు. ధరణి లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో భూ సమస్యలకు పరిష్కారం చూపెట్టాం. ఇదే తరహాలో గ్రామ కంఠం భూముల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారన్నారు మంత్రి ఎర్రబెల్లి.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మెదక్ జిల్లాలోని కొత్తపల్లి మల్లంపేట, మహబూబ్నగర్ జిల్లాలోని అన్నారెడ్డిపల్లి, నంచెర్ల గ్రామ పంచాయతీల్లో పైలెట్ ప్రాజెక్టు చేపట్టింది ప్రభుత్వం. అలాగే స్వామిత్వ పథకం కింద, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సరస్వతి గూడ, మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమ కుంట, జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం అర్లి గ్రామం, కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం దోమకొండ గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద డ్రోన్ల ద్వారా సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో గ్రామ కంఠాలకు సంబంధించి కొత్త మ్యాప్ లను సిద్ధం చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ లోగా గ్రామ స్థాయిలో ఎదురువుతున్న సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి