Telangana Government Websites: తెలంగాణలో ప్రభుత్వ ఆన్లైన్ సేవలు మూడు రోజులపాటు నిలిచిపోనున్నాయి. అలాగే ప్రభుత్వ వెబ్సైట్లన్నీ కూడా పని చేయవని తెలంగాణ స్టేట్ డేటా సెంటర్ వెల్లడించింది. ఈ నెల 9 నుంచి 11 వరకు ఈ సేవలకు అంతరాయం కలగనున్నట్లు పేర్కొంది. వెబ్సైట్లు, ఆన్లైన్ సేవలకు కేంద్ర బిందువైన స్టేట్ డేటా సెంటర్ (ఎస్డీసీ) లో కొత్త యూపీఎస్ సిస్టంను ఏర్పాటు చేయనున్న దృష్ట్యా వెబ్ సైట్లు, ఆన్లైన్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఐటీ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఆధునిక యూపీఎస్ (అన్ ఇంటరప్టబుల్ పవర్ సోర్స్) ఏర్పాటు కోసం ఈ నెల 9వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 11వ తేదీ రాత్రి 9 గంటల వరకు సేవలను నిలిపివేస్తున్నట్లు ఎస్డీసీ ప్రకటించింది.
ప్రస్తుతం గచ్చిబౌలిలోని టీఎస్ఐఐసీ సెంటర్లో ఎస్డీసీ ఉంది. 2010లో ఏర్పాటు చేసిన ఈ ఎస్డీసీ.. 2011 నుంచి సేవలందిస్తోంది. దీనికి అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన వివిధ అప్లికేషన్లు, సర్వర్లు అనుసంధానమై ఉన్నాయి. ఎస్డీసీలో చాలా కాలంగా పాత యూపీఎస్ ఉన్నందున పవర్ బ్యాకప్లో సాంకేతిక సమస్యలు తలెత్తి తరచూ ఐటీ సేవలకు అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో దాని స్థానంలో కొత్త యూపీఎస్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఐటీ శాఖ నిర్ణయించింది. దీనిద్వారా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా కొత్త వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయనుంది.
Also Read: