Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి గుడ్‌న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరు ఎప్పుడంటే..? ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే మీకు ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు కొత్త ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఎప్పటినుంచి ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరు అవుతాయా అని చూస్తున్నారు. దీనిపై తాజాగా క్లారిటీ వచ్చింది.

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి గుడ్‌న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరు ఎప్పుడంటే..? ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana Indiramma Indlu Scheme

Updated on: Feb 04, 2026 | 11:34 AM

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రభుత్వం విడతల వారీగా కొత్త ఇళ్లను మంజూరు చేస్తోంది. కేటగిరీలుగా లబ్దిదారులను విభజించి దశలవారీగా ఇళ్లను మంజూరు చేస్తోంది. ఇప్పటివరకు గ్రామాలు, పట్టణాల్లోని ప్రజలకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. వీటిల్లో కొన్ని ఇళ్లు ఇప్పటికే గృహప్రవేశాలు పూర్తవ్వగా.. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. వేగంగా ఇళ్లు పూర్తయ్యేందుకు ప్రభుత్వం ప్రతీవారం లబ్దిదారులకు నిధులను జమ చేస్తోంది. ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యే కొద్ది లబ్దిదారుల అకౌంట్లోకి జాప్యం జరగకుండా నిధులు రిలీజ్ చేస్తోంది. అలాగే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేవారికి ఇసుక, ఇటుకలు లాంటి సామాగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది.

త్వరలోనే రెండో జాబితా

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దరఖాస్తు చేసుకున్నవారి ఆర్ధిక పరిస్థితిని అంచనా వేసి ముందుగా అత్యంత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోంది. తొలి జాబితాలో ఎంతోమంది పేదలకు ఇళ్లను మంజూరు చేయగా.. రెండో జాబితా త్వరలోనే విడుదల చేయనున్నట్లు తాజాగా మున్నిపల్ ఎన్నికల ప్రచారంలో గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్నిపాలిటీలో పలు వార్డుల్లో మున్నిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి శుభవార్త అందుతుందని, రెండో విడత లబ్దిదారుల జాబితా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అర్హులైన వారందరికీ ఈ విడతలో ఇళ్లను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.

అర్హులైన ప్రతీఒక్కరికీ ఇళ్లు

అర్హులైన ప్రతీఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను అందించే బాధ్యతను తాను తీసుకుంటానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వంలో రాజకీయాలను పక్కనపెట్టి అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామన్నారు. కాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందిస్తోంది. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే కొద్ది 4 విడతలుగా వీటిని లబ్దిదారుల అకౌంట్లో నేరుగా జమ చేస్తోంది. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్‌కు పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలనే ఆలోచన రాలేదని విమర్శించారు. ఇక డ్వాక్రా మహిళలకు రూ.23 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు చేశామని, కొత్త రేషన్ కార్డులను ఇచ్చామన్నారు. అలాగే రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందిస్తున్నామన్నారు.  అలాగే సన్నబియ్యం పండించిన రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ కూడా ఇటీవల విడుదల చేశామని పొంగులేటి పేర్కొన్నారు.