
తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ శుభవార్త తెలిపింది. ఆరోగ్య సేవలను మెరుగపర్చేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక సదుపాయాలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా టెక్నాలజీతో కూడుకున్న హెల్త్ ఏటీఎంలను తీసుకురావాలని యోచిస్తోంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ఆస్పత్రుల్లో తీసుకురాగా.. ఇవి విజయవంతమయ్యాయి. దీంతో మరిన్ని ఆస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతోంది. ఔట్ పేషెంట్లు ఎక్కువగా ఉండే హాస్పిటల్స్లో వీటిని నెలకొల్పనుంది. హెల్త్ ఏటీఎంలుగా పిలుస్తున్న ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్టింగ్ మెషీన్లను త్వరలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం కింగ్ కోఠి జిల్లా హాస్పిటల్, మలక్ పేట్ ఏరియా ఆస్పత్రుల్లో హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా వీటిని ఏర్పాటు చేసి పరీక్షించారు. ఇవి పూర్తిగా విజయవంతం అయ్యాయి. రోగ నిర్ధారణలో ఇవి ఖచ్చితత్వాన్ని చూపిస్తున్నాయి. ఈ హెల్త్ ఏటీఎంలలో పరీక్షలు చేయించుకున్న రోగుల నమూనాలను టీ డయాగ్నోస్టిక్ కేంద్రాలకు పంపారు. ఇక ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లలో కూడా పరీక్షలు నిర్వహించారు. హెల్త్ ఏటీఎంలలో వచ్చిన రిజల్ట్స్.. వీటిల్లోనే అలాగే వచ్చాయి. ఫలితాలు సరిపోవడంతో హెల్త్ ఏటీఎంల పనితీరు బాగుందనే అంచనా అధికారులు వచ్చారు. దీంతో మరిన్ని ప్రభుత్వ దవాఖానాల్లో వీటిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఇప్పటికే వీటిపై ప్రభుత్వానికి ఒక నివేదికను అధికారులు సమర్పించారు. రోగుల రద్దీ ఎక్కువగా ఉంటే హాస్పిటల్స్లో వీటిని ఏర్పాటు చేయడం వల్ల ఆరోగ్య సేవలు వేగంగా అందించవచ్చు.
ఈ హెల్త్ ఏటీఎంలు కొన్ని నిమిషాల వ్యవధిలోనే 132 రకాల టెస్టులు ఆటోమేటిక్గా చేస్తాయి. డాక్టర్తో సంబంధం లేకుండా ప్రాధమిక ఆరోగ్య పరీక్షలు అన్నీ పూర్తి చేస్తాయి. అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ వైద్య పరికాలతో పనిచేసే ఈ ఏటీఎంలు.. రోగి బాడీని స్కాన్ చేసి బీపీ, రక్తంలో ఆక్సిజన్ స్థాయి. బరువు, ఎత్తు, బాడీ టెంపరేచర్ వంటి వాటిని వేగంగా కొలుస్తాయి. ఇక డెంగ్యూ, మలేరియా. యూరిన్, కొలెస్ట్రాల్, ఈసీజీ, షుగర్, హెచ్ఔడీ వంటి ర్యాపిడ్ టెస్టులు వేగంగా చేస్తాయి. ఇక రోగి డిజిటల్ హెల్త్ రికార్డ్ తయారుచేసి భద్రపరుస్తుంది. ఇక టెస్టులు పూర్తయిన తర్వాత దీని ద్వారానే డాక్టర్తో మాట్లాడుకోవచ్చు. ఓ ప్రైవేట్ సంస్థ ఈ యంత్రాలను అభివృద్ది చేయగా.. రెండు నెలల పాటు పరీక్షించారు. వీటి వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో వేగంగా రోగులకు సేవలు అందుతున్నాయి. డాక్టర్ల కోసం వెయిట్ చేసే పని తప్పుతుంది. ఇలా వీటి వల్ల అనేక లాభాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.