
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లి చరిత్ర సృష్టించబోతోంది. రాష్ట్రంలోనే తొలి గ్రామంగా రికార్డ్ నెలకొల్పేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే అధికారులు సర్వే కూడా చేపట్టారు.

కొండారెడ్డిపల్లిని రాష్ట్రంలోనే పూర్తిస్థాయి సోలరైజ్డ్ గ్రామంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో మోడల్ సోలార్ విలేజ్గా కొండారెడ్డిపల్లిని మార్చే ప్రక్రియను సంబంధిత అధికారులు ప్రారంభించారు.

టీజీఎస్పీడీసీఎల్ ఛైర్మన్ ఎండీ ముషారఫ్ ఫరూఖీతోపాటు నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్, రెడ్కో వీసీ, ఎండీ అనిల, సంస్థ డైరెక్టర్ కే రాములు, ఇతర శాఖల ముఖ్య అధికారులంతా.. మంగళవారం (సెప్టెంబర్ 10న) రోజున కొండారెడ్డిపల్లిలో పర్యటించారు.

కొండారెడ్డిపల్లిలో సుమారు 499 గృహ వినియోగదారులు, 66 కమర్షియల్ కస్టమర్లతో పాటు 867 వ్యవసాయ వినియోగదారులు, ఇతర కేటగిరిలతో కలుపుకుని మొత్తంగా 1451 విద్యుత్ వినియోగదారులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

గ్రామస్తులు, రైతులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులతో అధికారులు మాట్లాడి.. ఈ పైలట్ ప్రాజెక్టు వివరాలు వివరించారు. గ్రామానికి అవసరమైన సౌర విద్యుత్ కెపాసిటీని అంచనా వేసి.. డీపీఆర్ తయారీ మొదలుపెట్టారు.

త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి సౌర విద్యుత్ కాంతులతో వెలుగిపోనుంది. ఫలితంగా.. రాష్ట్రంలోనే పూర్తిస్థాయి తొలి సోలరైజ్డ్ విలేజ్గా కొండారెడ్డిపల్లి రికార్డు క్రియేట్ చేయనుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లి చరిత్ర సృష్టించబోతోంది.